తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ సీనియర్ లీడర్ నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ముందుగా పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు లేదని చెబితే ఎలా అని ప్రశ్నించారు. ముందుగా నిర్ణయించినట్టే సభ నిర్వహిస్తామని, అందుకు సహకరించాలని ఆయన కోరారు.
అమరావతి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు పర్యటనకు సంబంధించి పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు పర్యటనపై ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ముందు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడేమో అడ్డకుంలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ప్రైవేటు స్థలం తీసుకుని సభ నిర్వహించుకోవాలని పోలీసులు తాజాగా సూచిస్తున్నారని తెలిపారు.
అనపర్తిలోని దేవీచౌక్ సెంటర్లో చంద్రబాబు నాయుడు పర్యటనకు పోలీసులు తొలుత అనుమతి ఇచ్చారు. కానీ, ఆ తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్నారని పార్టీ నేతలు చెప్పారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదని ఇప్పుడు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించినట్టుగా దేవీచౌక్ సెంటర్లోనే రోడ్ షో నిర్వహించి తీరుతామని తేల్చి చెప్పారు.
Also Read: విశాఖలో రియల్టర్ మధు కిడ్నాప్: రౌడీషీటర్పై సీపీకి బాధిత కుటుంబం ఫిర్యాదు
చంద్రబాబు నాయుడి పర్యటనను అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు సభలకు వచ్చిన స్పందన చూసి కంటగింపుగానే పోలీసులు ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి ఇచ్చారని, ఇప్పుడు వారే అనుమతి లేదని చెబితే చేసేదేమిటీ? అని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. లేదంటే.. తాము మాత్రం వెనక్కి తగ్గబోమని, ముందుగా నిర్ణయించినట్టుగానే సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
