Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh: ఏపీ జిల్లాల పేర్ల‌లో స్వ‌ల్ప మార్పులు.. ప‌లుచోట్ల వ్య‌తిరేక‌త‌లు.. నిరసనలు !

Andhra Pradesh: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి మండలి ఆమోదం తెలుపుతూ.. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.  కొత్త జిల్లాల‌కు సంబంధించి ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ ను సైతం విడుద‌ల చేసింది. అయితే, ఏపీలోని జిల్లాల పేర్ల‌లో స్వ‌ల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిపై పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ.. నిరసనలకు దిగుతున్నారు. 
 

Andhra Pradesh map set to change with 13 new districts :See All Details Here
Author
Hyderabad, First Published Jan 27, 2022, 11:18 AM IST

Andhra Pradesh: కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం (Andhra Pradesh) ప్రతి జిల్లాకు వేర్వేరుగా ముసాయిదా ప్రకటనలు జారీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వరుసగా 26 జిల్లాలకు సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ప్రతిపాదనలపై స్థానికులకు ఏమైనా అభ్యంతరాలున్నా, సూచనలు చేయాలనుకున్నా 30 రోజుల్లోగా సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు తెలియజేయాలని ప్రభుత్వం పేర్కొంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లకు సంబంధించి మంగళవారం రాత్రి మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండానికి, ఆ  తర్వాత జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్లలో పేర్కొన్న దానికీ స్వల్ప తేడాలున్నాయి.

కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అనీ, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్లు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన మెమోరాండంలో పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి అనీ, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. అయితే,  గెజిట్‌ నోటిఫికేషన్లలో మాత్రం... కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకు కాకినాడ జిల్లా అనీ, రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తూర్పుగోదావరి జిల్లా అని పేరు పెట్టినట్లుగా పేర్కొన్నారు. ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అనీ, భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు పశ్చిమగోదావరి అని పేరు పెట్టినట్లుగా తెలిపారు. మంగళవారం రాత్రి క్యాబినెట్ సమావేశం ముగిశాక, ఈ మార్పులు చేసినట్లు తెలిసింది. రాజమహేంద్రవరం, భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఎక్కువ భాగం గోదావరి నదిని ఆనుకుని ఉన్నందున వాటికి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలని పేర్లు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అలాగే, రెండు జిల్లాల్లో రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు క్యాబినెట్‌ మెమోరాండంలో పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో కనిగిరి పేరు తీసేశారు. కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే శ్రీసత్యసాయి జిల్లాలో పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొనగా, గెజిట్‌ నోటిఫికేషన్‌లో మాత్రం పెనుగొండ, పుట్టపర్తితోపాటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

స్థానిక భాష అధారంగా పేర్లు.. 

కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వుల్లో దొర్లిన అక్షరదోషాలను రెవెన్యూ శాఖ బుధవారం సవరించింది. స్థానికంగా వాడుకలో ఉన్నట్లు పేర్లలో మార్పులు చేర్పులు చేసింది. తిరుపతి అర్బన్‌ జిల్లా విషయంలో ఆంగ్లంలో చివరి అక్షరాలను ‘టీహెచ్‌ఐ’ అని పేర్కొన్నారు. సవరించిన జీఓలో దానిని ‘టీఐ’గా పేర్కొన్నారు. ఇలా అన్ని జిల్లాల్లో ఆంగ్ల అక్షరాల్లో మార్పుచేర్పులు వంద వరకు జరిగాయి. అర్థం ఒకటే అయినా, స్థానికంగా వినియోగంలో ఉన్న భాషలో ఉండేలా సవరించినట్లు అధికారులు తెలిపారు. ఎస్‌పీఎస్‌ నెల్లూరు జిల్లా అని తొలుత పేర్కొన్నారు. దానిని ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. అలాగే వైఎస్‌ఆర్‌ కడప అని తొలుత పేర్కొనగా దానిని ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లాగా సవరించారు. మండలం పేరును బీఎన్‌ కండ్రిగ అని పేర్కొనగా దానిని బుచ్చినాయుడు కండ్రిగగా మార్చారు. ఉత్తర్వుల్లో డ్రాఫ్ట్‌ ఫార్మ్‌-1 అన్న పదాలు తొలగించి, ఫార్మ్‌-1గా గుర్తించాలని సవరించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జిల్లాల విభజనపై అసంతృప్తి సెగ‌లు ! 

జిల్లాల విభ‌జ‌న నేప‌థ్యంలో సుదీర్ఘ‌కాల డిమాండ్లను పట్టించుకోలేదని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఆకాంక్షలు, డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. కొత్త జిల్లాల కోసం ఎప్పటి నుంచో ఉన్న కొన్ని డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదన్న అసంతృప్తి కొందరి నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉద్యమానికి సిద్ధమవుతుండగా, కొందరు వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఒక జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న తమను... మరో జిల్లా పరిధిలోకి తీసుకురావడంపై కొన్నిచోట్ల స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. 

నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ స్థానాన్ని కర్నూలు జిల్లాలో కలపడాన్ని పాణ్యం, గడివేముల మండలాలవారు వ్యతిరేకిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు, ఓర్వకల్లు మండలాలు కర్నూలు నగరానికి దగ్గర్లో.. పాణ్యం, గడివేముల నంద్యాలకు సమీపంలో ఉంటాయి. జిల్లా విభజన జరిగితే కల్లూరు, ఓర్వకల్లు మండలాల్ని కర్నూలు జిల్లాలో కలపాలని కల్లూరు పరిరక్షణ సమితి ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో వారి ఆకాంక్ష నెరవేరినట్టయింది. కానీ పాణ్యం, గడివేముల మండలాల వారికి ఇబ్బందిగా మారింది. నంద్యాలకు 5-15 కి.మీ. దూరంలో ఉన్న తమను కర్నూలు జిల్లాలో కలపడమేంటని ప్రశ్నిస్తున్నారు.

రాజంపేట విషయంలో వైకాపా నేత మండిపాటు.. నిర‌స‌న ర్యాలీలు ! 

రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలంటూ భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌) ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి నుంచి, బీటీ కళాశాల వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు.  మదనపల్లె జిల్లాసాధన ఐకాస ఆధ్వర్యంలో బిందెల గౌతమ్‌కుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం రాజంపేటను జిల్లా కేంద్రం చేయకపోవడంపై రాజంపేట మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మర్రి రవి సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వైకాపా ఓడిపోతుందన్నారు. కావాలంటే రాయచోటిని, మదనపల్లెని కలిపి వేరే జిల్లాగా చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్ణయం మార్చుకోకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. తమను ఉంచితే కడప జిల్లాలో ఉంచాలని, లేకపోతే రాజంపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ రాజంపేట మండలం కొత్తబోయినపల్లెలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద టీడీపీ నేతలు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేశారు.

కందుకూరు వాసుల ఆగ్రహం

ప్రకాశం జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడం, కందుకూరు శాసనసభ స్థానాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడంపై ప్రజాసంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. కందుకూరు ఒంగోలుకి 44 కి.మీ. దూరంలో ఉంది. నెల్లూరు వెళ్లాలంటే 111 కి.మీ. దూరం ప్రయాణించాలి. మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుచేయాలని ప్రకాశం జిల్లా పశ్చిమప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కనిగిరి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మార్కాపురం డివిజన్‌గా ఉండగా, అదే అసెంబ్లీ స్థానం పరిధిలో పొదిలి కేంద్రంగా రెండో డివిజన్‌ ఏర్పాటు చేయడానికి బదులు, కనిగిరి కేంద్రంగా ఏర్పాటు చేయాలని టీడీపీ నేత ముక్కు ఉగ్రనరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఈ రెండు పట్టణాల మధ్య దూరం 17 కిలోమీటర్లే. వాటి పరిధిలోని మండలాలకు, జిల్లా కేంద్రాలకు మధ్య చాలా దూరం ఉందని స్థానికులు అంటున్నారు.

పెదకూరపాడులోనూ..

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గాన్ని గురజాల రెవెన్యూ డివిజన్‌లో కలపడంపైనా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్ని కలిపి ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని, లేకపోతే పెదకూరపాడును గుంటూరు రెవెన్యూ డివిజన్‌లోనే ఉంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

విజయవాడ దగ్గర్లోనివి మచిలీపట్నం జిల్లాలోకా?

విజయవాడకు దగ్గర్లోని పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాలో చేర్చడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటినీ ఎన్టీఆర్‌ జిల్లాలో చేర్చాలని డిమాండ్లు వస్తున్నాయి.

అశాస్త్రీయ విభజన..

శ్రీకాకుళం జిల్లాను అశాస్త్రీయంగా విభజించారని జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, సనపల నర్సింహులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం, పాలకొండ, పలాస కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటుచేయాలని డిమాండు చేశారు. చీపురుపల్లి రెవెన్యూడివిజన్‌ ఏర్పాటుచేయాలని విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు కిమిడి నాగార్జున డిమాండ్‌ చేశారు. అరకు లోక్‌సభ స్థానం చాలా పెద్దదైనందున మూడు జిల్లాలుగా చేయాలని ఏపీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ విశాఖ జిల్లా కన్వీనర్‌ రామారావు దొర డిమాండ్‌ చేశారు. విలీన మండలాల్ని కలిపి, తూర్పుగోదావరి ఏజెన్సీని రంపచోడవరం జిల్లాగా, విశాఖ ఏజెన్సీని పాడేరు జిల్లాగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్ని కలిపి మరో జిల్లాగా చేయాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios