ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖమంత్రి  నారా లోకేష్ వాట్సాప్ అకౌంట్ నిలిచిపోయింది. అయినా ఆయన ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మరో మార్గం ఎంచుకున్నారు. ఆయన చేసినపనికి ప్రజలు ఫిదా అవుతున్నారు...ఇంతకూ ఆయనేం చేసారంటే... 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి వింత అనుభవం ఎదురయ్యింది. ఆయన వాట్సాప్ అకౌంట్ ను మెటా బ్లాక్ చేసింది. అయితే తన వాట్సాప్ పనిచేయడంలేదని ఆయన ప్రజా సమస్యలను తెలుసుకోకుండా ఊరుకోలేదు... ఇది కాకుంటే మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇలా ప్రజాసమస్యల పరిష్కారానికి ఆయన చూపిస్తున్న చొరవ అందరిని ఆకట్టుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా లోకేష్ కు మళ్ళీ ఐటీ శాఖ దక్కింది. అలాగే విద్యాశాఖ బాధ్యతలు ఈయనే చూస్తున్నారు. అంతేకాదు ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంగళగిరిలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు లోకేష్. ఇలా తన శాఖల పనులతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అలుపెరగకుండా పనిచేస్తున్నారు.

అయితే లోకేష్ న స్వయంగా కలిసి తమ సమస్యలను తెలిపేవారు కొందరయితే... ఫోన్ ద్వారా చాలామంది వినతులు పంపిస్తున్నారు. ఏదయినా సమస్య వుంటే తనకు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని గతంలో లోకేష్ ఫోన్ నంబర్ తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన వాట్సాప్ కు లెక్కకుమించిన మెసేజ్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయిపోయింది. 

అయితే వాట్సాప్ పనిచేయకపోతే ఏం మరో మార్గంలో తనకు సమస్యలు తెలియజేయాలని ప్రజలను కోరారు లోకేష్. తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి సమస్యలను ప్రస్తావిస్తూ మెయిల్ చేయాలని... వాటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఐటీ మంత్రి సూచించారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ ఎన్నికల సమయంలో చెప్పారు... ఇప్పుడు ఆచరిస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు. 

ఇటీవల తన వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయిన మంత్రి లోకేష్ 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. దీంతో ఆయను వాట్సాప్ చేస్తే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో పెరిగిపోయింది. దీంతో ఆయనను స్వయంగా కలిసి సమస్యలు తెలియజేయడం కంటే వాట్సాప్ ద్వారా తెలియజేయడం ఈజీగా వుండటంతో అందరూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో వేలాది మెసెజ్ లు లోకేష్ కు వాట్సాప్ ద్వారా వస్తున్నాయి... దీంతో సాంకేతిక సమస్య ఏర్పడి వాట్సాప్ బ్లాక్ అయ్యింది. 

యువగళం పాదయాత్ర సమయంలో యువతకు దగ్గరయ్యేందుకు "హలో లోకేష్" కార్యక్రమాన్ని చేపట్టారు ప్రస్తుత ఐటీ మంత్రి. ఇందుకోసం ప్రత్యేకంగా hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే మెయిల్ ఐడీని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని ఆయన సూచించారు. ప్రతి మెయిల్ కు తాను స్పందిస్తానని లోకేష్ తెలియజేశారు.