వైసిపి రెబల్ ఎంపీ రఘురామకు హైకోర్టులో చుక్కెదురు... చింతామణి నాటకంపై నిషేధం కొనసాగింపు
వైసిపి ప్రభుత్వం ప్రాచీన చింతామణి నాటకాన్ని నిషేధించడంపై స్టే ఇవ్వాలని వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలుచేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారించింది.
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధించడంపై స్టే ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించిన న్యాయస్థానం పిటిషనర్ వాదనతో ఏకీభవించలేదు. దీంతో చింతామణి నాటకంపై నిషేధాన్ని కొనసాగించింది.
చింతామణి నాటకంలో వైశ్యుడు సుబ్బిశెట్టిది స్త్రీ వ్యామోహం కలిగిన పాత్ర. దీంతో వైశ్యులు ఈ నాటకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగన్ సర్కార్ ను ఆశ్రయించారు. వారి అభ్యర్థన మేరకు చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేధించింది.
అయితే చింతామణి నాటకంపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది న్యాయస్థానం. ఇవాళ(శుక్రవారం) ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపగా న్యాయవాది ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమేని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
చింతామణి నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు రంగస్థల నటులతో పాటు మరికొందరు జీవన ఉపాధి కోల్పోయారని అన్నారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని... అలాంటి నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదన్నారు. కాబట్టి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా పిటిషనర్ తరపున న్యాయవాది ఉమేష్ అభ్యర్థించారు.
పిటిషనర్ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం చింతామణి నాటకం నిషేధంపై స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి హైకోర్టు అంగీకరించలేదు. ఈ నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్స్లేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 17 కు వాయిదా వేసింది.
చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ప్రధానమైనది. ఆయన ఓ వైశ్యుడు. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడు. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్య వైశ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఏపీ సర్కార్ చింతామణి నాటక ప్రదర్శనను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా చింతామణి నాటకాన్ని ప్రదర్శించకుడదని ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు నాట ప్రసిద్ధి చెందిన సాంఘిక నాటకం చింతామణి. 20వ దశాబ్దంలోని మూడో దశకంలోని సామాజిక సమస్యల ఆధారంగా కవి కాళ్లకూరి నారాయణరావు ఈ నాటకాన్ని రచించారు. ఈ నాటకం ఇప్పటికీ ఊరూరా ప్రదర్శితమవుతూనే ఉంటుంది. ఇది వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే నాటకం. ఈ నాటకాన్ని తొలిసారి బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. 1923 నాటికే సుమారు 446 సార్లు దేశమంతా ప్రదర్శింపబడింది. అలాంటిది ఈ నాటకాన్ని రాష్ట్రంలో నిషేధించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
దీంతో పలువురు రంగస్థల నటులు, ఇతరులు చారిత్రాత్మక నాటకంపై నిషేదం తగదని జగన్ సర్కార్ ను కోరారు. అయినప్పటికి ప్రభుత్వం స్పందించకపోవడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఇలా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా విచారణ కొనసాగుతోంది.