తెలుగుదేశం పార్టీ  అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్  డెవలప్ మెంట్ కేసులో  రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో  ఇవాళ విచారణ జరిగింది.   


అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు చంద్రబాబుకు జరిగిన వైద్య పరీక్షలకు సంబంధించి నివేదికను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అందించారు.సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విన్పించారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వవద్దని ఆయన కోరారు. ఈ పిటిషన్ లో మిగిలిన వాదనలను రేపు వింటామని ఏపీ హైకోర్టు తెలిపింది. దీంతో విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

చంద్రబాబుపై ఉద్దేశ్యపూర్వకంగానే కేసులు నమోదు చేశారని బాబు తరపు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనలను సీఐడీ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు.చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఈ విషయం వెలుగు చూసిందని సీఐడీ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలను రేపు కూడ విన్పించనున్నారు. 

also read:స్కిల్ కేసులో హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు: బాబుపై సీఐడీ కీలక ఆరోపణలు

ఇదిలా ఉంటే ఇవాళ ఉదయమే ఏపీ హైకోర్టులో స్కిల్ కేసులో ఏపీ సీఐడీ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది.ఈ అఫిడవిట్ లో కీలక విషయాలను ప్రస్తావించింది సీఐడీ. ఈ కేసులో సాక్షులను చంద్రబాబు పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఆ ఆఫిడవిట్ లో సీఐడీ ఆరోపణలు చేసింది

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అరెస్ట్ చేసింది.ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ నెల 28వ తేదీన లొంగిపోవాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న విచారణ జరిగింది. అయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా విచారణ వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. రేపు కూడ ఈ పిటిషన్ పై వాదనలు కొనసాగుతాయి.