సీఎం జగన్తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ.. ఆ విషయంపైనే చర్చ..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో(YS Jagan) డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. అరగంట పాటు వీరిద్దరి భేటీ సాగింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో(YS Jagan) డీజీపీ గౌతమ్ సవాంగ్ (Gautam Sawang) భేటీ అయ్యారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన గౌతమ్ సవాంగ్.. సీఎం వైఎస్ జగన్ను కలిశారు. దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. నిన్న పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తలపెట్టిన చలో విజయవాడ విజయవంతం అయిన నేపథ్యంలో.. డీజీపీతో సీఎం జగన్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో ఉద్యోగుల చలో విజయవాడ అంశం చర్చకు వచ్చినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి.
నిన్న జరిగిన ఉద్యోగుల చలో విజయవాడ సభపై సమావేశంలో సీఎం జగన్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగుల రాకను అంచనా వేయడంలో ఇంటలిజెన్స్, నిఘా వ్యవస్థ విఫలమైనట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. అందువల్ల ఇంటెలిజన్స్, నిఘా వ్యవస్థ పనితీరుపైనా చర్చించినట్లు తెలిసింది. ఉద్యోగుల భారీ సభ ఏర్పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగులు చేరుకోవడంపై సీఎం జగన్కు డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. ఇక, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం జగన్ పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలంటూ పీఆర్సీ సాధన సమితి నిర్వహించిన చలో విజయవాడ విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విజయవాడ చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. BRTS రోడ్డుపై బైఠాయించి ఉద్యోగులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. PRC జీవోలను వెనక్కి తీసుకొనేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. (sajjala rama krishna reddy) గురువారం మాట్లాడుతూ.. సమ్మె వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మేము ఒక్కొక్కరం ఐదు ఓట్లు వేయిస్తామంటే బ్లాక్ మెయిల్ చేయడమే కదా అని సజ్జల అన్నారు. వాళ్లకు సమస్యను పరిష్కరించుకునే ఉద్దేశం లేదనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. బలప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలమవుతుందని రామకృష్ణారెడ్డి అన్నారు. వరుస చర్చల సమయంలో పరిస్థితి వివరించినా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. సీఎం దృష్టికి ఏదొచ్చినా ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని సజ్జల పేర్కొన్నారు.