ప్రజలను లూటీ చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఫైర్
Tirupati: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను దోచుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Congress senior leader Chinta Mohan: ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ సర్కారు, రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మరోసారి విమర్శల దాడిని కొనసాగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను లూటీ చేస్తున్నాయని ఆరోపించింది.
వివరాల్లోకెళ్తే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను దోచుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో చింతా మోహన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతోందనీ, వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోందనీ, తద్వారా రాష్ట్రాన్ని ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారన్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదనీ, ఈ అంశంపై చర్చకు వారు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
వేల కోట్ల రూపాయలతో టీటీడీ నడుపుతోందనీ, దాతృత్వ సంస్థ, దాని అనుబంధ సంస్థల్లో పనిచేసే కార్మికులను తక్కువ జీతాలు ఇచ్చి దోపిడీ చేస్తోందని ఆయన అన్నారు. కార్మికుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూముల రీసర్వే గురించి ప్రస్తావిస్తూ, పేద రైతుల భూములను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని చింతా మోహన్ ఆరోపించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం చౌక ధరల దుకాణాలకు 11 వస్తువులను ఇచ్చిందనీ, ఇప్పుడు ప్రజలకు బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని చింతా మోహన్ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రూ.350గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రూ.1,200కు పెరిగిందన్నారు. దీంతో పాటు అనేక నిత్యావసరాల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ పతనానికి ఇదే కారణమవుతుందని చెప్పారు. కాగా, కాంగ్రెస్ తిరుపతి మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు యర్లపల్లి గోపి, పూతలపట్టు ప్రభాకర్, రవి, శ్రీనివాస్ రెడ్డి, శాంతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, ఉమ్మడి ఏపీలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్.. విభజన తర్వాత తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. ఈ క్రమంలోనే మళ్లీ తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. వ్యూహాత్మకంగా, జిల్లాల వారీగా ప్రాధాన్యతలను జాబితా చేసి, సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపడం, శిక్షణ, దిశా నిర్దేశం కార్యక్రమాల ద్వారా క్యాడర్ను బలోపేతం చేయడం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఉనికిని పెంపొందించడం, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు 'పాదయాత్ర'తో పాటు అనేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు.
కాంగ్రెస్కు ప్రజలే పెద్ద బలం అని అభివర్ణించిన రుద్రరాజు.. “ప్రజలు ఎన్ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల పాలనను చూశారనీ, అనుభవ లేమి పరిపాలనా సామర్థ్యాలు కచ్చితంగా ఏపీని వెనక్కి నెట్టేశాయని అన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పటికీ పరిష్కరించని మూడు రాజధానుల సమస్యపై కేంద్రీకృతమై ఉందన్నారు. బీజేపీని 'బాబు-జగన్-పవన్ కళ్యాణ్ త్రయం' అని తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు.