దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్.. మహిళలకు అన్యాయం జరిగితే సహించబోమని వెల్లడి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) బుధవారం దిశ పెట్రోలింగ్ వాహనాలను (Disha patrolling vehicles) ప్రారంభించారు. 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలకు సచివాలయం ప్రధాన గేటు వద్ద జెండా ఊపి శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) బుధవారం దిశ పెట్రోలింగ్ వాహనాలను (Disha patrolling vehicles) ప్రారంభించారు. 163 ఫోర్ వీలర్ దిశ పెట్రోలింగ్ వాహనాలకు సచివాలయం ప్రధాన గేటు వద్ద జెండా ఊపి శ్రీకారం చుట్టారు. శాసన మండలి ఛైర్మన్ మోషేన్రాజు, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 900 ద్విచక్ర వాహనాలు మహిళల రక్షణ కోసం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి.
ఇక, దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయన్నారు. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక, బందోబస్తు సమయాల్లో మహిళా పోలీసులకు సౌకర్యవంతంగా ఉండేలా 18 కారా వ్యాన్లను సీఎం జగన్ ప్రారంబించారు. దిశా యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సహాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామనని సీఎం వెల్లడించారు.
దిశ పెట్రోలింగ్ వాహనాలు..
దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్కి అనుసంధానమై ఉంటాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించేలా ఏర్పాట్లు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలీసింగ్ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.