తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 3 పట్టభధ్రుల, 2 ఉపాధ్యాయుల, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తిరుపతిలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో మార్చి 15న రీపోలింగ్ నిర్వహించారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ విషయంలో అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా బ్యాలెట్ పేపర్లను పరిశీలించారు. ముందుగానే చెల్లని ఓట్లను పక్కకు పెట్టేశారు.
శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు విడుదల చేశారు. వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించట్టుగా తెలిపారు. మొత్తం 752 ఓట్లు పోలవ్వగా.. నర్తు రామారావుకు 632 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు.
-శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గానికి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గానికి 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
- శ్రీకాకుళం స్థానిక సంస్థల నియోజకవర్గానికిఇద్దరు అభ్యర్థులు బరిలో నిలిచారు.
- పశ్చిమగోదావరి స్థానిక సంస్థల రెండు నియోజకవర్గాలకు 6 గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.
-కర్నూలు స్థానిక సంస్థల నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
-ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గంలో 8మంది బరిలో నిలిచారు.
- కడప–అనంతపురం–కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 12 మంది బరిలో ఉన్నారు.
తెలంగాణ విషయానికి వస్తే.. మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13 పోలింగ్ నిర్వహించారు. ఈ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గం మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మరియు హైదరాబాద్ జిల్లాల పరిధిలోకి వస్తుంది. ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.
