సిఎం రమేష్ దీక్షపై జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కడపలో జెసి సంచలన వ్యాఖ్యలు
కడప: గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ఓ వర్గం వారిని హత్యలు చేయించిన మోడీకి ప్రధానిగా కొనసాగే అర్హతే లేదని అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేస్తున్న దీక్షపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కడపలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరహరదీక్ష చేస్తున్న టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరహర దీక్షకు శుక్రవారం నాడు జెసి దివాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.
ఈ రకమైన దీక్షల వల్ల కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీక్షల వల్ల ఉక్కు రాదు, తుక్కు రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రధానమంత్రి మోడీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూడున్నర ఏళ్ళ క్రితమే ఈ విషయాన్ని తాను సీఎం చంద్రబాబునాయుడుకు చెప్పానని ఆయన గుర్తు చేశారు. ఏపీకి మోడీ ఏ రకమైన సహాయం చేయబోరని ఆయన చెప్పారు.
కేంద్రంలో ఈ రకమైన ప్రభుత్వం ఉండడం ఏపీ ప్రజల దురదృష్టమని జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని జెసి ఆరోపించారు. ప్రజల కోసం కేంద్రం పనిచేయడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.