బాబుకు చిక్కులు: కీలెరిగి వాత పెట్టిన జేసీ
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై టీడీపీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో ఉన్న సమయంలో జేసీ అలకబూనడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు జేసీని సంతృప్తి పర్చేందుకు సమయం కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అమరావతి: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీరుపై టీడీపీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కూడగట్టే పనిలో ఉన్న సమయంలో జేసీ అలకబూనడంతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు జేసీని సంతృప్తి పర్చేందుకు సమయం కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్తో కేంద్రప్రభుత్వంపై టీడీపీ అవిశ్వాస నోటీసు ఇచ్చింది.ఈ నోటీసుపై జూలై 20వ తేదీన లోక్సభలో చర్చ జరగనుంది.
అయితే ఈ సమయంలో పార్లమెంట్కు తాను హాజరు కాబోనని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. తన డిమాండ్లను నెరవేర్చకపోతే టీడీపీకి రాజీనామా చేస్తానని అల్టిమేటం జారీ చేశారు.
ఈ పరిణామం అనంతపురం టీడీపీలో తీవ్ర అలజడికి కారణమైంది. దీంతో జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్లు.. ఆయన ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనే దానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తోంది.
అనంతపురంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని జేసీ దివాకర్ రెడ్డి పట్టుబడుతున్నారు.అయితే కొంత కాలంగా అనంతపురం పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జేసీ దివాకర్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ల నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని సీఎం చంద్రబాబునాయుడు అమరావతికి పిలిపించారు. సీఎం చంద్రబాబునాయుడుతో ప్రభాకర్ చౌదరి సమావేశమయ్యారు.
ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విబేధాల విషయమై చంద్రబాబునాయుడు చర్చిస్తున్నారు. మరో వైపు కీలకమైన ఇలాంటి సమయంలో జేసీ దివాకర్ రెడ్డి అలకబూనడంపై టీడీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ తరహా పరిణామాలు పార్టీకి మంచివి కావనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నారు. పార్టీకి రాజీనామాల చేస్తానని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించడం వెనుక కారణాలు ఏమిటనే విషయమై కూడ టీడీపీ సీనియర్లు ఆరా తీస్తున్నారు.
అయితే జేసీ దివాకర్ రెడ్డి తీరుపై పార్టీ నేతలు మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే జేసీ ని శాంతింపజేసేందుకు పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటుంది. గురువారం సాయంత్రానికి అన్ని సర్ధుకొనే అవకాశాలు ఉన్నాయని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.