ఫోన్ స్విచ్చాఫ్ చేసిన జేసీ..? కారణమేంటంటే..
మహానాడు ఎఫెక్ట్ తోనే..
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారట. అంతేకాదు.. పెద్దగా ఎవరినీ కూడా కలవడం లేదట. దీనంతటికీ కారణం.. ఇటీవల అమరావతిలో జరిగిన మహానాడు కార్యక్రమేనట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో అమరావతిలో మహానాడు కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ.. స్పీచ్ అదరగొట్టాడు. ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు వేస్తూనే.. సొంత పార్టీ అధినేత చంద్రబాబుకి కొన్ని చురకలు అంటించారు. దీంతో.. ఆయన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే.. మహానాడు కార్యక్రమం ముగిసిన నాటి నుంచి జిల్లాలో ఆయన పాపులారిటీ మరింత రెట్టింపు అయ్యింది. అందరూ ఆయన స్పీచ్ గురించే చర్చించుకోవడం ప్రారంభించారు.
తాము మాట్లాడలేని, చెప్పలేని విషయాలను ఆయన నిర్మొహమాటంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి హీరోగా మారారని జిల్లాకి చెందిన కొందరు టీడీపీ నేతలు కీర్తిస్తున్నారు. దీంతో మహానాడు తర్వాత జిల్లాకు వచ్చిన దివాకర్రెడ్డికి ఫోన్ల తాకిడి అధికమైంది. ఈ తాకిడి తట్టుకోలేక కొన్ని రోజులు లోకల్ నంబర్ని ఆయన స్విచాఫ్ చేశారట! ఢిల్లీ నంబర్ ఆన్లో పెట్టుకున్నారట. ఈ మాటని జేసీ అనుచరులే చెబుతున్నారు.
జేసీ గురించి ఆయన అనుచరులు మరికొన్ని విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారు. జేసీ సూచనల మేరకే సీఎం చంద్రబాబు పాలనాపరమైన విషయాల్లో కొన్ని సంస్కరణలను తీసుకువచ్చారట. జన్మభూమి కమిటీల రద్దు, టెలికాన్ఫరెన్స్ల తగ్గింపు వంటి చర్యలు జేసీ సూచనల తోనే చేపట్టారట. అధినేత వద్ద ఏ అంశమైనా చెప్పడానికి జేసీ సంకోచించరట. ఈ క్రమంలోనే ఆయన మహానాడు వేదికపైన అంత ధైర్యాంగా మాట్లాడారన్నది జేసీ అభిమానులు చెప్పుకోవడం విశేషం.