పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
Amaravati: 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు బదులుగా విజయవాడలో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి విన్నపం చేశారు. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Centre's key comments on Polavaram project: పోలవరం ప్రాజెక్టు, ప్రస్తుతం పరిస్థితులను గురించి కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమనీ, ఈ స్థాయి వరకే నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రజెక్టు క్రమంలో పునరావాస చర్యలు సైతం ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది.
వివరాల్లోకెళ్తే.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వైఎస్సార్సీసీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి లోక్ సభలో పోలవరం ప్రాజెక్టును గురించి ప్రశ్నలు అడిగారు. దీనికి కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం చెబుతూ కీలక విషయాలు వెల్లడించారు. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమనీ, ఈ స్థాయి వరకే నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రజెక్టు క్రమంలో పునరావాస చర్యలు సైతం ఇంకా పూర్తికాలేదని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు కారణంగా నివాసాలను కోల్పోయిన వారికి పునరావాసం సైతం ఇంకా పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. పోలవరం తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని తెలిపిన ప్రహ్లాద్ సింగ్ పటేల్.. తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందన్నారు. అది ఇంకా పూర్తికాలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
ఇదిలావుండగా, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని రైతు సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు బదులుగా విజయవాడలో ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి విన్నపం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని వివిధ రైతు సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వివిధ రైతు సంఘాల ప్రతినిధులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పోలవరం సాధికార కమిటీ చైర్మన్ డాక్టర్ జీవీఎల్ శాస్త్రి, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, నీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు తదితరులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్ లో వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారనీ, కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయి 150 అడుగులు, 194 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మిస్తే ఉపయోగం ఉండదన్నారు.