‘‘నాపై కేసు కొట్టివేయండి..’’: ఏపీ హైకోర్టులో ఆమంచి క్వాష్ పిటిషన్
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుపై గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తనపై కేసును కొట్టివేయాలంటూ ఆమంచి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసుపై గురువారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తనపై కేసును కొట్టివేయాలంటూ ఆమంచి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై ఆమంచి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన తరుఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరోవైపు ఈ కేసులో తదుపరి చర్యలు ఉంటాయని సీబీఐ తెలిపింది.
దీంతో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలుకు వాయిదా వేసింది. ఇక, న్యాయమూర్తులపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆమంచి కృష్ణమోహన్ను ఇప్పటికే ఓ దఫా సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇటీవల తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసిన సీబీఐ..జూన్ 22వ తేదీన తమ ముందు హాజరు కావాలని తెలిపింది. ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకాలేనని ఆమంచి సీబీఐ అధికారులకు తెలిపారు. సమయం ఇస్తే వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆమంచి కృష్ణమోహన్ ను చేసిన వినతిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.
Also Read: మాజీ ఎమ్మెల్యే ఆమంచికి మరోసారి నోటీసులు జారీచేసిన సీబీఐ..
అయితే తాజాగా మరోమారు ఆమంచికి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఈ నోటీసులు ఇచ్చింది. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది.