మాజీ ఎమ్మెల్యే ఆమంచికి మరోసారి నోటీసులు జారీచేసిన సీబీఐ..
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు శనివారం సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల ఆమంచికి సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆరోజు విచారణకు హాజరుకాకపోవడంతో నేడు మరోసారి నోటీసులు జారీచేసింది.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు శనివారం సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇటీవల ఆమంచికి సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద ఈ నోటీసులు ఇచ్చింది. విజయవాడలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది. అయితే ముందుకు ముందుగానే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకాలేనని ఆమంచి సీబీఐ అధికారులకు తెలిపారు. సమయం ఇస్తే వారం రోజుల్లో విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆమంచి కృష్ణమోహన్ ను చేసిన వినతిపై సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఇక, ఈరోజు బాపట్ల ఎస్పీ కార్యాలయంలో ఆమంచి కృష్ణమోహన్ను పిలిచి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులు అందజేశారు. పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చిన నేపథ్యంలో పలువురు సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులను దూషిస్తూ, అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఇలా సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థను కించపరుస్తూ, జడ్జిలను బెదిరించేలా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదయ్యాయి.
వైసీపీ నేతలు న్యాయవ్యవస్థను కించపర్చేలా విమర్శలు చేశారని కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంలో రాష్ట్ర పోలీసుల విచారణ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై గత ఏడాది నవంబర్ మాసంలో 16 మందిపై కేసులు నమోదు చేసింది సీబీఐ. గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను యథాతథంగా నమోదు చేసినట్టుగా సీబీఐ తెలిపింది. ఐటీ సెక్షన్లలోని 154, 504, 505 సెక్షన్ల ప్రకారంగా సీఐడీ నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్ ను ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్టుగా సీబీఐ ప్రకటించింది.
ఈ క్రమంలోనే న్యాయస్థానాలపై అనుచితమైన పోస్టులను సోషల్ మీడియాలో పెట్టారనే అభియోగాలపై ఆమంచి కృష్ణమోహన్ను ఇప్పటికే ఓ దఫా సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు సీబీఐ అధికారులు ఆమంచికి నోటీసులు జారీచేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.