ఓటుకు నోటు కేసు ఎత్తి బాబుపై రవీంద్ర బాబు తీవ్ర వ్యాఖ్యలు
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందునే హైద్రాబాద్ నుండి విజయవాడకు చంద్రబాబునాయుడు పారిపోయి వచ్చారని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చెప్పారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినందునే హైద్రాబాద్ నుండి విజయవాడకు చంద్రబాబునాయుడు పారిపోయి వచ్చారని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చెప్పారు.
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు సోమవారం నాడు వైసీపీ చీప్ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్తో కలిసి హైద్రాబాద్లోని లోటస్పాండ్లో జగన్ను కలిశారు.
రాష్ట్రాభివృద్ధి కోసమే తాను టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు ఆయన చెప్పారు. వైసీపీలో ఏ హోదా ఆశించకుండానే పార్టీలో చేరానన్నారు.టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.
చంద్రబాబు వల్లే ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాలేదన్నారు. కులాల వారీగా చంద్రబాబు వద్ద ఆర్మీ ఉంటుందన్నారు. ఏ కులం వారు విమర్శలు చేస్తే అదే కులానికి చెందినవారితో తిట్టిస్తారని రవీంద్ర బాబు ఆరోపించారు.
తన నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినట్టు చెప్పారు. దళితుడిగా ఉన్నందునే టీడీపీలో వివక్ష కొనసాగించినట్టు రవీంద్రబాబు చెప్పారు. ఆర్థికంగా రాష్ట్రం కుంటుపడిందన్నారు. ఒక్క సామాజిక వర్గం మాత్రమే బాగుపడిందన్నారు.
ఆ ఒక్క సామాజికవర్గం మినహా అన్ని సామాజిక వర్గాలు టీడీపీకి బుద్ది చెబుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసం తాను వైసీపీలో చేరలేదన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను వైసీపీలో చేరినట్టు ఆయన చెప్పారు.
ప్రత్యేక హోదా గురించి వైసీపీ నేత జగన్ మడమ తిప్పకుండా పోరాటం చేశారని రవీంద్రబాబు చెప్పారు. 105 మంది టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతిపరులన్నారు.