అప్పటివరకు అలిపిరి నడక మార్గం క్లోజ్...: టిటిడి ప్రకటన
తిరుమలలో ఏడుకొండలపై వెలిసిన శ్రీవారిని దర్శించుకునేందకు భక్తులు ఎక్కువగా ఉపయోగించే అలిపిరి నడక మార్గాన్ని మూసివేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్దమయ్యింది.
తిరుపతి: తిరుమలలోని ఏడుకొండలను కాలినడకన ఎక్కి కలియుగ ప్రత్యక్షదైవమైన వెంకటేశ్వర స్వామి చాలామంది భక్తులు దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా అలిపిరి మార్గంలోనే ఎక్కుమంది కొండపైకి నడక సాగిస్తున్నారు. అయితే రెండు నెలల పాటు ఈ అలిపిరి మార్గాన్ని మూసివేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్దమయ్యింది.
వచ్చేనెల జూన్ 1 నుండి జూలై 31 వరకు అలిపిరి నడక మార్గాన్ని మూసి వేయనున్నారు. అలిపిరి నడక మార్గంలో మరమ్మత్తులు చేపట్టడానికే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి ప్రకటించింది. కాలినడకన తిరుమల కొండపైకి చేరుకోవాలనుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గంగుండా చేరుకోవాలని టిడిపి విజ్ఞప్తి చేసింది. శ్రీవారి మెట్టు మార్గానికి భక్తులు చేరుకునేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తామని టిటిడి ప్రకటించింది.
read more తిరుమలపై కరోనా ఎఫెక్ట్: తగ్గిన భక్తులు, ఆదాయం
2020 సెప్టెంబర్ లో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మరమ్మత్తులు చేపట్టారు. అయితే ఆ సమయంలో భక్తులను అనుమతించారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా వుంది. దీంతో అలిపిరి నడక మార్గాన్ని రెండు నెలలు పూర్తిగా మూసేసి మరమ్మతులు పూర్తి చేయాలని టిటిడి భావిస్తోంది. అలిపిరి మెట్ల మార్గం ఆదునీకరణ పనులకోసం అప్పట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.