ఈ నెలలో తేల్చండి... లేదంటే ఆగస్ట్ మొత్తం ఆందోళనలే..: వైసిపి సర్కార్ కు అగ్రిగోల్డ్ బాధితుల అల్టిమెటం
వైసిపి ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి ఆందోళనలకు సిద్దమయ్యారు.
విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి భారీ ఆందోళనలకు సిద్దమయ్యారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన వైసిపి ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతోనే సరిపెట్టిందని... అందువల్లే ప్రభుత్వంపై మరోసారి పోరాటానికి సిద్దమైనట్లు అగ్రి గోల్డ్ కష్టమర్స్ ఆండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది.
ఇవాళ విజయవాడలో 26 జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అగ్రి గోల్డ్ కష్టమర్స్ ఆండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శులు చేసారు.
అగ్రిగోల్డ్ బాధితులను ప్రస్తుత వైసిపి ప్రభుత్వం మోసం చేసిందని నాగేశ్వరరావు అన్నారు. ప్రతిపక్షంలో వుండగానే కాదు అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని వైసిపి హామీ ఇచ్చిందని గుర్తుచేసారు. కానీ తూతూ మంత్రంగా అగ్రిగోల్డ్ బాధితులకు నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని నాగేశ్వరరావు డిమాండ్ చేసారు.
ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేయకుంటే మళ్లీ ఆందోళనల బాట పడతామని ఆయన హెచ్చరించారు. ఈ నెలలో (జూలై) ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సరి... లేదంటేఆగస్టు నెలలో దశలవారిగా అగ్రిగోల్డ్ బాధితులంతా ఆందోళన చేపడుతారని ప్రకటించారు. ఇలా మొదట గ్రామస్థాయిలో ప్రారంభించి జిల్లా స్థాయిలో అధికారులకు న్యాయం చేయాలంటూ అగ్రిగోల్డ్ బాధితులంతా వినతి పత్రాలు ఇస్తాన్నారు. ఇక ఆగస్టు చివరి రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులతో బెజవాడలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని నాగేశ్వరరావు ప్రకటించారు.
అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామన్నారు. కాబట్టి వెంటనే వైసిపి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీమేరకు అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు.