నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో 30ఏళ్లు జగనే సీఎం: పవన్ పై సినీనటుడు పృథ్వీ ఫైర్
జగన్ ను ముఖ్యమంత్రిగా తాను అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించారని పవన్ అంగీకరించకపోతే ఏంటని నిలదీశారు ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్. జగన్ ను ముఖ్యమంత్రిగా తాను అంగీకరించడం లేదని పవన్ కళ్యాణ్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించారని పవన్ అంగీకరించకపోతే ఏంటని నిలదీశారు.151సీట్లతో జగన్ ను ముఖ్యమంత్రిని చేసి అధికారం కట్టబెట్టిన ప్రజల మద్దతు జగన్ కు ఉందని, వారు అంగీకారం ఉందని తెలిపారు.
ప్రజలే అంగీకరించినప్పుడు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే ఏంటి అంగీకరించకపోతే ఏంటని నిలదీశారు. రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అంటున్న పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో చంద్రబాబును ఒక్కసారి కూడా ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ఏ రెడ్డి తలనైనా నరుకుతానన్న పవన్ కు సపోర్ట్ : జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎలా ఉంటారో కనీసం ఆయనకు కూడా తెలియదని పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. హిందూదేవాలయాల్లో ఎక్కడా అన్యమత ప్రచారం జరగడం లేదని చెప్పుకొచ్చారు.
జగన్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు పవన్ కళ్యాణ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్ళలోనూ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు.
తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదని తాము ఒట్టు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి కానీ, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదంటూ ప్రతిపక్షాలకు సూచించారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే మంచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు తెచ్చుకుంటున్నారిని పృథ్వీరాజ్ కొనియాడారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎక్కడకెళ్ళినా ప్రజలు జగన్ పరిపాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశపై రేప్, అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను నడిరోడ్డుపై తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మానవమృగాలకు బతికే అర్హత లేదన్నారు పృథ్వీరాజ్.
నన్ను ఆపితే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా: జగన్ కు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్