చంద్రబాబుకి ఊరట: లక్ష్మీపార్వతి పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టివేసింది.
హైదరాబాద్: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ న్యాయస్థానం సోమవారం నాడు కొట్టివేసింది. చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్ ను కొట్టివేసింది.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని.. ఏసీబీ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ ప్రారంభంకాక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు ఎలా వింటామని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. తర్వాత బాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.