సత్యసాయి జిల్లాలో అమానుషం... మనవరాలి వయసు బాలికను పెళ్ళాడిన అరవయేళ్ల తాంత్రికుడు
మంత్రతంత్రాల పేరిట నమ్మించి తల్లిదండ్రుల అనుమతితోనే పదహారేళ్ల బాలికను పెళ్లాడాడు ఓ అరవైరెండేళ్లు తాంత్రికుడు. ఈ దారుణం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
అనంతపురం : పెద్ద మంత్రగాడిగా అందరినీ నమ్మించి గ్రామంలో తిష్టవేసాడు. దెయ్యాలు, బూతాలు వున్నాయంటూ అమాయక ప్రజలను మోసం చేయసాగాడు. అయితే గ్రామస్తులు పూర్తిగా నమ్మడంతో మరింత రెచ్చిపోయిన ఆ బురిడీ మాంత్రికుడు వయసులో వున్న అమ్మాయిలపై కన్నేసాడు. ఇలా ఓ పదహారేళ్ళ బాలికను ఈ అరవైరెండేళ్ళ తాంత్రికుడు పెళ్ళాడిన దారుణం ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.... శ్రీసత్యసాయి జిల్లా యల్లనూరు మండలం పాతపాలెం గ్రామానికి చెందిన జయకృష్ణ(62) మంత్రాల పేరిట ప్రజలను నమ్మించి తాంత్రికుడిగా మారాడు. ఇలా కొన్నేళ్లకిందట బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామానికి వలసవెల్లి జడలస్వామి అవతారమెత్తాడు. గ్రామంలో ఎవరు అనారోగ్యానికి గురయినా దెయ్యాల పేరుతో భయపెట్టి తన మంత్రాలతో నయం చేస్తానని క్షుద్రపూజలు చేసేవాడు. ఇలా మంత్రాలు, పూజల పేరిట డబ్బులు వసూలుచేస్తూ గ్రామస్తులను మోసం చేసేవాడు జయకృష్ణ అలియాస్ జడలస్వామి.
అయితే గ్రామస్తులు తనను పూర్తిగా నమ్మడంతో రాజకీయ నాయకుడి అవతారమెత్తాడు జయకృష్ణ. అధికార వైసిపి పార్టీలో చురుగ్గా పనిచేస్తూ కృష్ణాపురం గ్రామ కమిటీ అధ్యక్ష పదవిని పొందాడు. ఇలా అటు తాంత్రికుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా రెండుచేతులా సంపాదించడంతో అతడి చేష్టలు మరింత దారుణంగా మారాయి.
ఈ క్రమంలో ఇటీవల అనారోగ్యంతో తన వద్దకు వచ్చిన ఓ మహిళను క్షుద్రపూజల పేరిట మోసం చేసాడు. దెయ్యం పట్టిందంటూ మహిళను నమ్మించాడు. కొద్దిరోజులకు మహిళ అరోగ్యం బాగుపడటంతో తన మంత్రతంత్రాలతో దెయ్యాన్ని తరిమికొట్టడంతోనే జబ్బు నయమయ్యిందని తెలిపాడు. ఆ మహిళ కూడా జడలస్వామి వల్లే తాను సంపూర్ణ ఆరోగ్యంగా మారానని భావించి పూర్తిగా నమ్మసాగింది.
Read More కామాంధుడికి దేహశుద్ధి.. వలసవచ్చిన మహిళలపై కన్నేసి వేధింపులు..
ఇలా జడలస్వామి భక్తురాలిగా మారిపోయిన మహిళ భర్త, కూతురితో కలిసి పలుమార్లు అతడివద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె పదహారేళ్ళ కూతురిపై ఆ బురిడీ తాంత్రికుడి కన్నుపడింది. దీంతో తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పిన జయకృష్ణ మనవరాలి వయసున్న బాలికను మూడు నెలల క్రితమే పెళ్లాడి అందరికీ శిష్యురాలిగా పరిచయం చేసాడు. కానీ ఎలాగోలా విషయం భయటకు పొక్కడంతో సదరు జడలస్వామి భాగోతం మోసాలన్ని వెలుగుచూసాయి.
బాలిక సమీప బంధువుకు విషయం తెలియడంతో ఐసిడిఎస్ అధికారులకు సమాచారమిచ్చాడు. దీంతో పోలీసుల సాయంతో అధికారులు గ్రామానికి చేరుకుని జడలస్వామి ఆశ్రమంలో తనిఖీ చేపట్టారు. ఈ విషయం ముందుగానే తెలియడంతో జయకృష్ణ అలియాస్ జడలస్వామి పరారవగా బాలికను ఆశ్రమంలో గుర్తించారు. ఆమెను వెంటనే అనంతపురం ఉజ్వల హోం కు తరలించారు. కేసు నమోదు చేసి నకిలీ తాంత్రికుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.