బీజేపీకి కన్నా వర్గం షాక్.. 500 మంది మూకుమ్మడి రాజీనామాలు, సోము వీర్రాజుపై సంచలన ఆరోపణలు
ఏపీ బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా వున్న 500 మంది పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.
బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ వర్గం షాకిచ్చింది. ఆయన వర్గంగా భావిస్తున్న దాదాపు 500 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై వారు సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగడానికి సోము వీర్రాజు అడ్డంకిగా మారారని ఆరోపించారు. పార్టీలో కన్నా లక్ష్మీనారాయణకు ప్రాధాన్యత తగ్గించారని వారు మండిపడ్డారు. ఫ్లెక్సీల్లో పవన్ కల్యాణ్ ఫోటో పెడితే నోటీసులు ఇస్తామని సోము వీర్రాజు హెచ్చరించారని వారు ఆరోపించారు.
ఇదిలావుండగా.. ఈరోజు భీమవరంలో జరుగుతోన్న ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా వుండటం చర్చనీయాంశమైంది. ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే సమావేశాలకు గైర్హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా లక్ష్మీనారాయణ దూరంగానే ఉన్నారు. ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి ఆహ్వనం పంపవద్దని ప్రత్యర్ధి వర్గం ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం కూడా సాగింది. అయినప్పటికీ ఈ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ నాయకత్వం ఆహ్వానం పంపింది. కానీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా దూరంగానే ఉన్నారు.
ALso REad: నేడు భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: దూరంగా కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ వీడుతారా?
మరోవైపు.. ఎన్నికలప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళవారం నాడు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. అనంతపరం వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పొత్తులపై వారం రోజుల ముందు స్పష్టత వస్తుందన్నారు. కొత్త పొత్తులు కలిస్తే కొత్త వారితో కలిసి వెళ్తామని.. పొత్తులు కుదరకపోతే ఒంటరిగా పోటీ చేస్తామన్నారు.2014 కాంబినేషన్ ను కాలమే నిర్ణయిస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రస్తుతం తమ పార్టీ బీజేపీతోనే ఉందన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు ను ఆహ్వానిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. పొత్తులపై అన్ని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయన్నారు. ఓట్లు చీలకుండా ఉండాలనేది తన అభిప్రాయమని ఆయన చెప్పారు. ఈ విషయమై అన్ని పార్టీలు కలిసి రావాల్సి ఉందన్నారు. తమ పార్టీకి బీజేపీ మధ్య మైత్రి ఉందని చెప్పారు.
తెలంగాణ రాజకీయాల్లో తన పాత్ర గురించి కాలం చెబుతుందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోనే ఉన్నారని..ఆయనంటే తనకు అపరిమితమైన గౌరవం ఉందన్నారు పవన్. తమ మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గురించి తాను ఎక్కువగా వ్యాఖ్యానించబోనని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేనలో కన్నా చేరుతున్నారా అనే విషయమై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. ప్రతి 15 ఏళ్లకు ఒక్కసారి యువత బయటకు వస్తుందన్నారు. ఎక్కువ పార్టీలు రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని.. రాజకీయాల్లో కూడా మార్పు అవసరమన్నారు.