దేవరగట్టు కర్రల సమరం: 35 మందికి గాయాలు
కర్నూల్ జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా కర్రల(బన్నీ) సమరంలో ఈ ఏడాదీ కూడ హింస తప్పలేదు
కర్నూల్: కర్నూల్ జిల్లా దేవరగట్టులో దసరా సందర్భంగా కర్రల(బన్నీ) సమరంలో ఈ ఏడాదీ కూడ హింస తప్పలేదు. కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారంగా కర్రల సమరంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కర్నూల్ జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా దసరా సందర్భంగా కర్రల సమరాన్ని నిర్వహించడం సంప్రదాయం. హోళగొంద మండలంలోని దేవరగట్టు సమీపంలోని కొండపై ఉన్న మాళమ్మ మల్లేశ్వరస్వామికి గురువారం రాత్రి 12 గంటల పాటు కళ్యాణం జరిపించారు.
కళ్యాణం తర్వాత ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకొనేందుకు గాను మూడు గ్రామాల ప్రజలు ఒక వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా కర్రలతో తలపడ్డారు. ఉత్సవ విగ్రహాలను దక్కించుకొనేందుకు రక్తం ధారగా కారుతున్న పట్టించుకోకుండానే భక్తులు కర్రల సమరంలో పాల్గొన్నారు.
ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు కూడ తరలివచ్చారు. బన్నీ ఉత్సవంలో హింస జరగకుండా ఉండేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సంప్రదాయం పేరుతో కొట్టుకోకూడదంటూ పోలీసులు ప్రచారం చేసినా కూడ స్థానికులు మాత్రం పట్టించుకోలేదు.
వెయ్యి మంది పోలీసులు బన్నీ ఉత్సవం సందర్భంగా గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎప్పటికప్పుడు పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కర్రల సమయంలో 35 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు.