రెండో రోజూ ఐటి సోదాలు: వేలిముద్రల కోసం హైదరాబాద్ కు సిఎం రమేష్
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హూటాహుటిన బయలుదేరారు. సీఎం రమేష్ నివాసాలతోపాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండోరోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం రమేష్ నుంచి అదనపు సమాచారం సేకరించాల్సిన అవసరం ఏర్పడటంతో ఐటీ అధికారులు సీఎం రమేష్ ను హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు హూటాహుటిన బయలుదేరారు. సీఎం రమేష్ నివాసాలతోపాటు కార్యాలయాలు, బంధువుల ఇళ్లల్లో రెండోరోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సీఎం రమేష్ నుంచి అదనపు సమాచారం సేకరించాల్సిన అవసరం ఏర్పడటంతో ఐటీ అధికారులు సీఎం రమేష్ ను హైదరాబాద్ రావాల్సిందిగా కోరారు.
ఐటీ అధికారుల ఆదేశాలతో సీఎం రమేష్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలు దేరారు. సాయంత్రం 6గంటలకు సీఎం రమేష్ హైదరాబాద్ చేరుకోనున్నారు. మరోవైపు రెండో రోజు జరుగుతున్న సోదాల నేపథ్యంలో కొన్ని లాకర్లు తెరవాల్సి ఉంది. అయితే అవి సీఎం రమేష్ వేలిముద్రలు వేస్తేనే కానీ తెరిచే అవకాశం లేకపోవడంతో సీఎం రమేష్ వచ్చిన వెంటనే తెరవాలని ఐటీ అధికారులు భావిస్తున్నారు.
అటు సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ లో భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అయితే కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో ఐటీ అధికారుల సోదాలు శుక్రవారమే ముగిశాయి. దాదాపు 10 గంటలపాటు ఐటీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీఎం రమేశ్ సోదరుడు సురేశ్ సమక్షంలో దాడులు నిర్వహించారు అధికారులు. తిరుపతి, ప్రొద్దుటూరుకు చెందిన 12 మంది ఐటీ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్ దాఖలుపై అధికారులు విచారించారు.