Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో స్వల్పంగా తగ్గిన కోవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 2,690 మందికి పాజిటివ్

ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,690 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 24 గంటల్లో కరోనా నుంచి 11,855 మంది కోలుకున్నారు. ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 88,364 మంది చికిత్స పొందుతున్నారు.

2690 new corona cases reported in andhra pradesh
Author
Amaravathi, First Published Feb 6, 2022, 7:28 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,690 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,03,455కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల ప్రకాశం జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,664కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 11,855 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,19,219కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 28,598 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,26,60,687కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 88,364 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 140, చిత్తూరు 131, తూర్పుగోదావరి 518, గుంటూరు 354, కడప 181, కృష్ణ 352, కర్నూలు 147, నెల్లూరు 123, ప్రకాశం 156, శ్రీకాకుళం 36, విశాఖపట్నం 198, విజయనగరం 56, పశ్చిమ గోదావరిలలో 298 చొప్పున వైరస్ బారినపడ్డారు.

కాగా.. మన దేశంలో కొవిషీల్డ్(Covishield), కొవాగ్జిన్‌(Covaxin)లతో పాటు ఆ తర్వాత స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్(Sputnik Light Vaccine) కూడా ఎక్కువ మంది తీసుకున్నారు. రష్యా ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ టీకా ప్రపంచంలోని చాలా దేశాల్లో పంపిణీ చేస్తున్నారు. కాగా, మన దేశంలోనూ కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు ముగుస్తుండగా.. బూస్టర్ డోసు కూడా పంపిణీ ప్రారంభం అయింది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను మూడో డోసుగా పంపిణీ చేస్తున్నారు. కాగా, స్పుత్నిక్ లైట్ టీకానూ బూస్టర్ డోసుగా పంపిణీ చేయాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ(Doctor Reddys Lab) కేంద్రానికి ప్రతిపాదన పెట్టింది. 

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ రష్యాకు చెందిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్‌లోనే ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి ఆర్‌డీఐఎఫ్‌కు చెందిన స్పుత్నిక్ లైట్ టీకాను మన దేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ పంపిణీ చేస్తున్నది. భారత్‌లో అత్యవసర సమయంలో పంపిణీ చేసే అనుమతులను భారత రెగ్యులేటరీ సంస్థ డీసీజీఐ రెడ్డీస్ ల్యాబ్‌కు ఇచ్చింది. రష్యా నుంచి ఈ టీకాలను భారత్‌కు అనుమతి చేసుకునే అనుమతులను రెడ్డీస్ ల్యాబ్ పొందిన సంగతి తెలిసిందే. 

బూస్టర్ డోసు విషయమై డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ సీఈవో ఎరెజ్ ఇజ్రాయెలీ ఓ ప్రకటన చేశారు. భారత్‌లో తాము స్పుత్నిక్ లైట్ టీకాల నిల్వలతో సంసిద్ధంగా ఉన్నామని వివరించారు. స్పుత్నిక్ లైట్‌ను టీకాగా రిజిస్టర్ చేయడానికి, దాన్ని స్పుత్నిక్ వీ టీకాకు బూస్టర్ డోసుగా వేయడానికి అనుమతులు ఇవ్వాలని రెగ్యులేటరీకి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్పుత్నిక్ టీకా భారత్ సహా ఇతర దేశాలకూ సానుకూలమైన ఒక అవకాశం అని వివరించారు. అయితే, ఇందుకోసం ట్రయల్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios