ఏపీ : స్కూళ్లలో విజృంభిస్తోన్న మహమ్మారి.. విజయనగరం, కృష్ణా జిల్లాల్లో కోవిడ్ కలకలం
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. పాఠశాలలు ఓపెన్ చేయడంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పది మంది విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అటు కృష్ణా జిల్లా భావదేవర పల్లి పాఠశాలలో మరో ముగ్గురు విద్యార్ధులకు కరోనా సోకింది.
ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. పాఠశాలలు ఓపెన్ చేయడంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పది మంది విద్యార్ధులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 26 మందికి టెస్టులు చేయగా.. పది మందికి వైరస్ సోకినట్లు తేలింది. పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉండగా.. ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
పది మంది విద్యార్థులు వైరస్ బారినపడడంతో పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల మధ్యాహ్న భోజన సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు ఎంఈవో వెల్లడించారు. వారం రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించాలని మున్సిపల్ కమిషనర్ను కోరినట్లు తెలిపారు. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విద్యార్థులందరి పరిస్ధితి నిలకడగా ఉందని.. వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు ఎంఈవో వివరించారు. మరోవైపు కృష్ణా జిల్లా భావదేవర పల్లి పాఠశాలలో మరో ముగ్గురు విద్యార్ధులకు కరోనా సోకింది.
ALso Read:ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 20,03,296కి చేరిన సంఖ్య, నాలుగు జిల్లాల్లో తీవ్రత
కాగా, ఏపీలో కొత్తగా 1601 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,201 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,061 మంది చికిత్స పొందుతున్నారు.