వైఎస్ వివేకా కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. కడప నుంచి అతనిని హైదరాబాద్ తరలించారు సీబీఐ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు జడ్జి. దీంతో ఉదయ్ కుమార్ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. వివేకా హత్య జరిగిన తర్వాత అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను రప్పించడంలో ఉదయ్ కుమార్ కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఆయనను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుందని భావించింది. కడప జిల్లాలోని తుమ్మలపల్లిలో ఉన్న యురేనియం ప్లాంట్ లో ఉదయ్ కుమార్ రెడ్డి పనిచేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలోనే ఉదయ్ ఉన్నట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ ఈ విషయాన్ని నిర్ధారించినట్లుగా సమాచారం.

Also Read: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం: సీబీఐ అదుపులో ఉదయ్ కుమార్ రెడ్డి

వివేకానందరెడ్డి మృతదేహనికి ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాష్ రెడ్డి బ్యాండేజీ కట్టారు. పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జయప్రకాష్ రెడ్డి పనిచేస్తున్నాడు. ఇప్పటికే వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు పలుమార్లు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించారు. గత ఏడాది ఫిబ్రవరిలో సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాంసింగ్ పై కేసు నమోదు చేశారు.