ఏపీలోని కడప జిల్లాలో భారీ ప్రమాదం సంభవించింది. ఓ ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లాలో భారీ పేలుడు సంభవించి పది మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. పేలుడు పదార్థాల బ్లాస్టింగ్ లో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లి ముగ్గురాళ్ల గనిలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాల క్రషర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురాయిని వెలికి తీసేందుకు కూలీలు వెళ్లారు. ఆ సమయంలో పేలుడు సంభవించింది.

సంఘటనా స్థలం అటవీ ప్రాంతంలో ఉంటుంది. పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి బయలుదేరారు. ఏడు మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాయి.

డిటొనేటర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. గాయపడినవారిని వివిధ ప్రాంతాల ఆస్పత్రులకు తరలించే పనిచేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురాయిని పేల్చేందుకు డిటొనేటర్ వాడుతారు. రోజువారీ పనిలో భాగంగానే డెటొనేటర్ ను అమర్చారు. అది పేలిన సమయంలో కూలీలంతా అక్కడే ఉన్నారు. 

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ 25 నుంచి 30 మంది దాకా అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందనే విమర్శలు వస్తున్నాయి. క్వారీలో మొత్తం 40 మంది పనిచేస్తున్నారు.

జిలిటెన్ స్టిక్స్ పేలడం వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. పేలుడు తీవ్రతకు దేహాలు తునాతునకలై చెల్లాచెదురుగా పడిపోయాయి. కూలీలు పులివెందులకు చెందినవారని భావిస్తున్నారు. జిలిటెన్ స్టిక్స్ తీసుకుని వెళ్తున్న వాహనంలో కూలీలు ప్రయాణించారని చెబుతున్నారు.

క్వారీకి అనుమతులు రద్దు చేశారని, అయినప్పటికీ క్వారీని నడుపుతున్నారని అంటున్నారు. దానిపై విచారణ జరిపేందుకు మైనింగ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో....

కడప జిల్లా మామిళ్లపల్లె పేలుళ్ల ఘటనలో పలువురు మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) చంద్రబాబు అన్నారు. మృతుల కుటంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇలాటంి పరిస్థితి నెలకొనడం బాధాకరమని ఆయన అన్నారు. 

విశాఖ ఎల్జీ బాధితులకు అందించినట్లే ఈ ఘటనలో మరణించివారి కుటుంబాలకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.