ప్రేమ పేరిట వెంటపడుతూ వేధింపులు... మనస్థాపంతో యువతి ఆత్మహత్య

Mar 20, 2023, 5:11 PM IST

మంచిర్యాల :ఆమెకు పెళ్ళి కుదిరింది. ఇది తెలిసి కూడా ఓ ఆకతాయి ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధించడంతో  తట్టుకోలేపోయింది. తీవ్ర మనస్థాపంతో చివరకు ప్రాణాలనే బలితీసుకున్న ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగుచూసింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన సాయిష్మ ను అదే గ్రామానికి చెందిన వినయ్ కుమార్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇప్పటికే తనకు పెళ్లి కుదిరిందని... వెంటపడుతూ వేధించవద్దని వేడుకున్నా వినయ్ వినిపించుకోలేదు. తనను కాకుండా వేరే ఎవరినో ఎలా పెళ్లిచేసుకుంటావో చూస్తానంటూ బెదిరించాడు. అంతేకాదు తనతో పెళ్లికి ఒప్పుకో... లేదంటే చచ్చిపో అంటూ ఫోన్లు చేసి వేధించేవాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయిన సాయిష్మ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు  ప్రాణాపాయస్థితిలో పడివున్న సాయిష్మను హైదరాబాద్ నిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.