సొంత నియోజకవర్గంలో కేటీఆర్ కి షాక్.. వాటర్ ట్యాంక్ ఎక్కిన చిరు వ్యాపారి.. సిరిసిల్లలో ఉద్రిక్తత

May 11, 2020, 4:46 PM IST

సిరిసిల్ల రాజన్న జిల్లా మంత్రి కేటీఆర్ పర్యటనకు నిరసనల సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ చిరు వ్యాపారి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. సోమవారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్ధనపల్లి టెక్స్ టైల్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇదే సమయంలో తమకు విద్యుత్ సబ్సిడీ రావడం లేదంటూ చిన్న పరిశ్రమల యజమాని నరహరి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులు వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చి అతన్ని సముదాయించి కిందకు దింపారు. సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతామని డీఎస్పీ చంద్రశేఖర్ నరహరికి చెప్పి పంపించారు.