గులాబీలతో ఇంటింటికి వెళ్లి... జగిత్యాల మున్సిపల్ కమీషనర్ వినూత్న కార్యక్రమం

Jan 23, 2023, 1:26 PM IST


జగిత్యాల :  పన్నులు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్న వారితో కఠినంగా కాకుండా ప్రేమతో వ్యవహరిస్తూ వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగిత్యాల మున్సిపల్ కమీషనర్. ఇలా పట్టణంలో దీర్ఘకాలికంగా ఆస్తి పన్ను చెల్లించనివారి ఇంటికి వెళ్లి గులాబీ పువ్వు ఇస్తూ ప్రేమగా పలకరిస్తున్నారు జగిత్యాల  మున్సిపల్ కమిషనర్ నరేష్. పట్టణ అభివృద్దికి సహకరిస్తూ వెంటనే ఆస్తి పన్ను బకాయి చెల్లించాలని కోరారు. ఇలా మున్సిపల్ సిబ్బందితో కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కమీషనర్ నరేష్. 

ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ... ఇప్పటివరకు జగిత్యాలలో ఆస్తి పన్ను కేవలం 30 శాతమే వసూలు అయ్యిందన్నారు. సుమారు 8 కోట్ల రూపాయలు బకాయి వుందని... ఈ పన్నులు వసూలు చేసేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్దికి సహకరించాలని జగిత్యాల ప్రజలను కమీషనర్ నరేష్ సూచించారు.