విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి పార్టీల నాయకులు సైతం ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారే తప్ప, ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం లేదని గుర్తుచేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రితో చెప్పిస్తే, స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు, ఉద్యోగులతో పాటు, ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ.. తిరుపతి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టుకు లేఖ రాసినట్టు తెలిపారు.