వేగంగా మారుతున్న ఏపీ రాజకీయాలు... సిపిఐ రామకృష్ణతో చంద్రబాబు భేటీ

Jan 19, 2023, 11:28 AM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వైసిపిని కట్టడిచేసి తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న టిడిపి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుపోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. టిడిపి కేంద్ర కార్యాలయానికి విచ్చేసి చంద్రబాబుతో భేటీ అయ్యారు రామకృష్ణ. అయితే రోడ్లపై సభలు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తూ జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 పై చంద్రబాబు, రామకృష్ణ చర్చింకున్నట్లు టిడిపి నాయకలు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని ఇరుపార్టీల నాయకులు తప్పుబట్టారు. జీవో 1 కు వ్యతిరేకంగా అన్నిపార్టీలను కలుపుకుని పోరాడాలని చంద్రబాబు, రామకృష్ణ నిర్ణయించారు.