Galam Venkata Rao | Published: Apr 2, 2025, 7:00 PM IST
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు శాసన మండలి సభ్యునిగా ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన కె. నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనలకు అనుగుణంగా బుధవారం శాసనమండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నాగబాబుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ, మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.