'నరసాపురం సీఎం సభలో దారుణం...అమ్మాయిల ఒంటిపై చున్నీలు తీయించి...'

Nov 23, 2022, 4:30 PM IST

 విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటన నేపథ్యంలో నిర్వహించిన సభలో విద్యార్థినులతో అత్యంత దారుణంగా వ్యవహరించారంటూ విశాఖపట్నం జనసేన నాయకురాలు ఉషాకిరణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి సభలో ఆడపడుచులను అవమానించారంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన మహిళ నేతలు ప్రభుత్వ వ్యతిరేక ప్లకార్డులు, నినాదాలతో ఆందోళనకు దిగారు. కాలేజీ విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభకు తీసుకువెళ్లడమే తప్పని... అలాంటిది అమ్మాయిల ఒంటిపై వున్న నల్ల చున్నీలను బలవంతంగా తొలగించి అనుమతించారని ఉషాకిరణ్ అన్నారు. ఇలా అమ్మాయిలను చున్నీలు లేకుండా చేసి నరసాపురంలో మరో కౌరవ సభ నిర్వహించారన్నారు. కన్న తండ్రి, తోబుట్టువుల ఎదుట నిండైన బట్టలతో వుండే ఆడపిల్లలకు అవమానం జరుగుతుంటే ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారా? అంటూ మండిపడ్డారు. బేషరతుగా సీఎం జగన్, మహిళా మంత్రులు క్షమాపణలు చెప్పాలని... లేదంటే దీనిపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని జనసేన మహిళలు హెచ్చరించారు.