చికెన్ పకోడీ కోసం తాగుబోతు వీరంగం... కారుతో గుద్దడంతో బాలుడు మృతి

Mar 29, 2021, 3:08 PM IST

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఆదివారం రాత్రి ఫూటుగా మద్యం సేవించిన కొవ్వూరి వీరబాబు ఓ చికెన్ పకోడి బండి వద్దకు వచ్చాడు. మద్యం మత్తులో విచక్షణను కోల్పోయిన అతడు పకోడి బండి నిర్వహకుడు ఏసుతో గొడవకు దిగాడు. దీంతో కోపంతో ఊగిపోయిన వీరబాబు పకోడి బండిని కారుతో గుద్ది ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని అడ్డుకోడానికి ఏసుతో పాటు అతడి కొడుకు శివ ప్రయత్నించారు. అయినా ఆగకుండా వీరబాబు వారిని కూడా కారుతో ఢీకొట్టడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 

ఇలా గాయపడిన తండ్రీ కొడుకులను కుటుంబసభ్యులు కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్సపొందుతూ అర్థరాత్రి శివ మరణించాడు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా గ్రామానికి భారీగా చేరుకొన్నారు పోలీసులు.