నిరుద్యోగులకు గుడ్ న్యూస్... భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోదం

Jan 4, 2023, 4:56 PM IST

అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల పనితీరు, పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనతో పాటు ఖాళీల భర్తీకి సంబంధించి అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పరిపాలనలో విప్లవాత్మక మార్పులకోసం గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు. వీటిలో ఖాళీలతో మన లక్ష్యం నెరవేరదని... అందుకే సచివాలయాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఈ సమీక్షా సమావేశంలోనే సీఎం ఆమోదం తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గతంలో చేపట్టిన నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా చేపట్టామని మంచి పేరు వచ్చిందని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలని సూచించారు. అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని... త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని సీఎంకు అధికారులు తెలిపారు.