నల్లగొండ: ఇంట్లోకి లాక్కెళ్లి, పట్టపగలు మహిళపై గ్యాంగ్ రేప్, ఆ తర్వాత హత్య

By telugu teamFirst Published Sep 23, 2021, 8:25 AM IST
Highlights

నల్లగొండ జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారు.

నల్లగొండ: తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో కామాంధులు రెచ్చిపోయారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఓ గ్రామంలో పట్టపగలు అత్యంత ఘోరమైన సంఘటన జరిగింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న 54 ఏళ్ల వయస్సు గల మహిళను ఇద్దరు వ్యవసాయ కూలీలు ఇంట్లోకి లాక్కెళ్లి, వివస్త్రను చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. 

నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను అదే గ్రామానికి చెందిన బక్కతట్ల లింగయ్య, పుల్లయ్యలుగా గుర్తించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో రోడ్డు వెళ్తున్న మహిళను ఇద్దరు నిందితులు ఇంట్లోకి లాక్కెళ్లి  దారుణానికి ఒడిగట్టినట్లు నల్లగొండ రూరల్ ఎస్సై రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మహిళపై అత్యాచారం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. 

పారిపోయే క్రమంలో వారికి మహిళ మరిది కనిపించాడు. ఆమె రోడ్డు మీద పడి ఉందని వారు అతనికి చెప్పారు. వారు చెప్పిన చోటికి అతను వెళ్లాడు. అయితే, వదిన కనిపించలేదు. దాంతో అతను లింగయ్య ఇంట్లోకి వెళ్లాడు. అక్కడ ఆమెకు వదిన శవం కనిపించింది. తలపై, ఒంటిపై తీవ్రమైన గాయాలు అయినట్లు గుర్తించాడు. 

అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలి ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారం గాజులు, మూడు తులాల పుస్తెలతాడు అక్కడే పడి ఉన్నాయి. దాంతో నిందితులు దొంగతనం కోసం ఆ దారణానికి ఒడిగట్టలేదని పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో వారు ఈ దారుణానికి పాల్పడినట్లు భావించారు. పోస్టుమార్టం నిమిత్తం మహిళ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులకు నేరప్రవృత్తి ఉందని, గతంలో కూడా వారు నేరాలు చేశారని చెబుతున్నారు. 

click me!