రేప్ చేసి గర్భవతిని చేశాడు: శీలానికి ఖరీదు కట్టారు

By pratap reddyFirst Published Aug 11, 2018, 12:29 PM IST
Highlights

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. 

మహబూబ్ నగర్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే, గ్రామ పెద్దలు పంచాయతీ పెట్టి బాలిక శీలానికి వెల కట్టారు. నిందితుడికి 2.5 లక్షల రూపాయల జరిమానా వేసి వదిలేశారు. 

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఈ సంఘటన జరిగింది. ఆగస్టు 1వ తేదీన జరిగిన సంఘటన రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని, నలుగురు పంచాయతీ పెద్దలను పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. 

ఐదుగురిని పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టుకు వారికి జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు స్థానిక సబ్ ఇన్ స్పెక్టర్ ఎం. కృష్ణయ్య చెప్పారు. 

తన తల్లిదండ్రులకు చేదోడుగా 17 బాలిక పత్తి పొలాల్లో పనిచేస్తోంది. పోలం యజమాని వెంకటయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆమె గర్భం దాల్చింది. 

బాలిక శరీరంలో మార్పులు రావడంతో తల్లి గుర్తు పట్టి ఆస్పత్రికి తీసుకుని వెళ్లింది. దాంతో విషయం బయటపడింది. నిందితుడికి, బాధితురాలికి మధ్య గ్రామంలోని కొంత మంది రాజీ కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం నెరిపారు. బాలిక తల్లిదండ్రులకు రూ.2.50 లక్షలు ఇచ్చారు.

అయితే, విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురిని అరెస్టు చేశారు. తాము గొడవ చేయబోమని బాధితురాలి తల్లిదండ్రుల నుంచి పంచాయతీ పెద్దలు రాతపూర్వకంగా హామీని కూడా తీసుకున్నారు. 

click me!