రియల్ ‘భీమిలీ కబడ్డీ జట్టు’... కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు...

By Chinthakindhi RamuFirst Published Jul 27, 2022, 11:47 AM IST
Highlights

కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన డిగ్రీ విద్యార్థి... తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో విషాదం... 

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘భీమిలీ కబడ్డీ జట్టు’ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో కబడ్డీ ఆట ఆడుతూ జట్టును గెలిపించి, ప్రాణాలు కోల్పోతాడు కథానాయకుడు. ఇలా కబడ్డీ ఆడుతూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలు. తాజాగా తమిళనాడులోనూ ఇలాంటి విషాద సంఘటనే జరిగింది...

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ఏరియాలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న విమల్‌రాజ్ అనే యువకుడు పాల్గొన్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విమల్‌రాజ్, జాతీయ జట్టుకి కబడ్డీ ఆడాలనే లక్ష్యంతో సేలంలో ఓ కబడ్డీ అకాడమీలో ట్రైయినింగ్ కూడా తీసుకుంటున్నాడు...

కూతలోనే ఊపిరి ఆగింది... కబడ్డీ ఆడుతూ గీతకి అడుగు దూరంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు... తమిళనాడులో జరిగిందీ విషాద సంఘటన.. pic.twitter.com/bEe4YPtrjX

— Asianetnews Telugu (@AsianetNewsTL)

స్థానిక కబడ్డీ పోటీల్లో పాల్గొన్న విమల్‌రాజ్ కూతకి వెళ్లాడు. ప్రత్యర్థి ప్లేయర్లపై నుంచి ఎగిరి గీత దగ్గరికి వచ్చిన విమల్‌రాజ్‌ను ప్రత్యర్థి జట్టుకి చెందిన ఓ ప్లేయర్ మీద పడి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో ఆ ప్లేయర్ మోకాలు, విమల్‌రాజ్ ఛాతిపై బలంగా తగిలింది. విమల్‌రాజ్ గీత దాటడం, అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో సదరు ప్లేయర్ కూడా లైన్ బయట చేతులు పెట్టడం కనురెప్పపాటులో జరిగిపోయాయి. 

దీంతో విమల్‌రాజ్‌కే పాయింట్ ఇస్తూ రిఫరీ విజిల్ విసిరాయి. ప్రత్యర్థి ప్లేయర్ తనపై నుంచి లేవగానే పైకి లేచేందుకు ప్రయత్నించిన విమల్‌రాజ్, లేస్తూనే కుప్పకూలిపోయాడు. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, రిఫరీ వచ్చి లేపేందుకు ప్రయత్నించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వెంటనే అప్రమత్తమైన తోటి ప్లేయర్లు, ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి చేరే సమయానికే విమల్‌రాజ్ ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు వైద్యులు. 

కబడ్డీ ఆడుతున్న సమయంలో గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయి ఉండాడని ప్రాథమిక అంచనాకి వచ్చారు వైద్యులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. తనకి ఎంతో ఇష్టమైన ఆటను ఆడుతూనే ఆయువు వీడిన విమల్‌రాజ్ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది... 

click me!