సింగపూర్ ఓపెన్‌ 2022: రెండో రౌండ్ గండం దాటిన పీవీ సింధు... సైనా నెహ్వాల్‌కి శుభారంభం..

By Chinthakindhi RamuFirst Published Jul 14, 2022, 1:44 PM IST
Highlights

సింగపూర్ ఓపెన్‌ 2022లో మూడో రౌండ్‌కి దూసుకెళ్లిన పీవీ సింధు...  తుయ్ లిన్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకున్న పీవీ సింధు...

భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ 500 టోర్నీలో రెండో రౌండ్ గండాన్ని దాటేసింది. వరల్డ్ 59వ ర్యాంకర్ తుయ్ లిన్ గుయెన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయాన్ని అందుకుంది పీవీ సింధు...

వియత్నాంకి చెందిన తుయ్ లిన్ గుయెన్‌, మొదటి రౌండ్‌లో పీవీ సింధుపై మంచి ఆధిపత్యం కనబర్చింది. 19-21 తేడాతో మొదటి సెట్ కోల్పోయిన పీవీ సింధు, ఆ తర్వాత అదిరిపోయే రేంజ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 21-19 తేడాతో రెండో సెట్ గెలిచిన తెలుగు తేజం, 21-18 తేడాతో మూడో సెట్‌ని సొంతం చేసుకుని... మూడో రౌండ్‌కి దూసుకెళ్లింది...

మూడో రౌండ్‌లో  చైనాకి చెందిన వరల్డ్ 19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్‌తో తలబడనుంది పీవీ సింధు. ఇంతకుముందు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ అస్మిత చాలిహాని ఓడించిన హ్యాన్ యూయ్‌తో ఇంతకుముందు 2019లో జపాన్ ఓపెన్ ఫైనల్‌లో తలబడింది పీవీ సింధు. ఆ మ్యాచ్‌లో రెండు సెట్లను 9-21, 17-21  తేడాతో చైనీస్ ప్లేయర్‌ని చిత్తు చేసింది సింధు...

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ 500 సింగపూర్ ఓపెన్ తొలి రౌండ్‌లో బెల్జియంకి చెందిన లియానె టాన్‌పై 21-15, 21-11 తేడాతో సునాయస విజయం అందుకుంది పీవీ సింధు. కొద్ది కాలం గ్యాప్ తర్వాత తిరిగి బ్యాటు పట్టిన సీనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, తొలి రౌండ్‌లో మరో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ మాళవిక బాన్సోద్‌పై 21-18, 21-14 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కి అర్హత సాధించింది...

థాయ్‌లాండ్ ప్లేయర్, వరల్డ్ నెం.12 ర్యాంకర్ బుసానన్‌ని 21-16, 21-11 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కి అర్హత సాధించిన అశ్మిత చాలిహా, వరల్డ్ నెం.19వ ర్యాంకర్ హ్యాన్ యూయ్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలైంది...
 

click me!