BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పుల్లెల గాయత్రి గోపిచంద్... వుమెన్స్ డబుల్స్‌లో ద్రోణాచార్యుడి కూతురు...

By Chinthakindhi RamuFirst Published Aug 19, 2022, 6:27 PM IST
Highlights

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ బరిలో పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి... వుమెన్స్ డబుల్స్‌లో త్రీషా జాలీతో కలిసి బరిలో గాయత్రి.. 

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 టోర్నీ టోక్యో వేదికగా సోమవారం ఘనంగా ప్రారంభం కానుంది. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి పీవీ సింధు తప్పుకున్నా, టీమిండియా నుంచి దాదాపు 10మందికి పైగా బ్యాడ్మింటన్ ప్లేయర్లు, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గనబోతున్నారు. అందులో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి గోపిచంద్ కూడా ఉంది...

క్రీడల్లో వారసత్వం వర్కవుట్ అయ్యేనా...

రాజకీయాల్లో, సినిమాల్లో వర్కవుట్ అయినట్టుగా క్రీడల్లో వారసత్వం పెద్దగా వర్కవుట్ కాదు. క్రికెట్‌లో రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ, సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్... టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు. ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కనీసం రంజీ మ్యాచుల్లో అయినా ఆడాలని తెగ కష్టపడుతున్నాడు...

భారత బ్యాడ్మింటన్‌ టీమ్‌కి ఛీఫ్ నేషనల్ కోచ్‌గా ఉన్న పుల్లెల గోపిచంద్, 2009లో ‘ద్రోణాచార్య’ అవార్డు కూడా పొందాడు. దీంతో పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి గోపిచంద్, భారీ అంచనాలతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ బరిలో దిగుతోంది...

ఎవరీ పీవీ వరలక్ష్మీ...

పుల్లెల గోపిచంద్ భార్య, గాయత్రి గోపిచంద్ తల్లి పీవీ వర లక్ష్మి కూడా భారత బ్యాడ్మింటన్ మాజీ ప్లేయర్. 8 సార్లు ఇండియా నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన వరలక్ష్మీ, 1996 అట్లాంట ఒలింపిక్స్‌లో టీమిండియా తరుపున పాల్గొంది. 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచింది పీవీ వరలక్ష్మీ...

ఇద్దరు లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్ల  నుంచి వారసత్వంగా షెటిల్ బ్యాటు అందుకున్న గాయత్రి గోపిచంద్, 2018 ఆసియా గేమ్స్‌లో పాల్గొంది. 2019 సౌత్ ఏషియా గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచిన గాయత్రి, వుమెన్స్ టీమ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది...

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో సెమీ ఫైనల్ చేరిన గాయత్రి, పుల్లెల గోపిచంద్ తర్వాత 21 ఏళ్లకు ఈ ఘనత సాధించిన భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో, వుమెన్స్ డబుల్స్ ఈవెంట్‌లో పోటీపడిన గాయత్రి గోపిచంద్...ఓ రజతం, ఓ కాంస్య పతకం గెలిచింది. 

కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత ప్లేయర్ త్రీషా జాలీతో కలిసి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియ్‌షిప్స్‌లో పాల్గొనబోతోంది గాయత్రి గోపిచంద్. మలేషియా వుమెన్స్ డబుల్స్ జోడీ లో ఈన్ యువాన్- వీ స్లోతో మొదటి రౌండ్‌లో తలబడనుంది గాయత్రి గోపిచంద్ - త్రీషా జాలీ జంట.. బ్యాడ్మింటన్ కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తెగ కష్టపడుతోంది గాయత్రి గోపిచంద్. 

click me!