అవిశ్వాసం ఏమౌతుంది?: పార్టీల బలబలాలివే

First Published Jul 18, 2018, 1:20 PM IST
Highlights

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై  చర్చకు పార్లమెంట్ ఉభయ సభలు  ఓకే చెప్పాయి. ఇతర సమస్యలపై కూడ కాంగ్రెస్‌తో పాటు  ఇతర పార్టీల అవిశ్వాస తీర్మాణ నోటీసులను పరిగణనలోకి తీసుకొన్నట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.  

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో టీడీపీ  కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై  చర్చకు పార్లమెంట్ ఉభయ సభలు  ఓకే చెప్పాయి. ఇతర సమస్యలపై కూడ కాంగ్రెస్‌తో పాటు  ఇతర పార్టీల అవిశ్వాస తీర్మాణ నోటీసులను పరిగణనలోకి తీసుకొన్నట్టుగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.  ఎట్టకేలకు అవిశ్వాసంపై  చర్చకు రెఢీ అంటూ కేంద్రం సంకేతాలు ఇచ్చింది.  అయితే ఈ అవిశ్వాస తీర్మాణంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఏం జరగనుంది, ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందా,  ఎన్డీఏకు బలముందా... యూపీఏ బలమెంత, బలం లేకున్నా అవిశ్వాసం ప్రతిపాదించడంలో ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకొందాం.

ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హమీ చట్టం అమలు చేయాలనే డిమాండ్‌తో  టీడీపీ ఇతర డిమాండ్లతో కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చాయి. ఈ నోటీసులు అందాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని  లోక్‌సభలో  కేంద్రంపై అవిశ్వాసతీర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మాణానికి మద్దతుగా  50 మంది ఎంపీలకు పైగా మద్దతు తెలిపారు. దీంతో ఈ విషయమై చర్చను చేపట్టనున్నట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

మరోవైపు రాజ్యసభలో కూడ ప్రత్యేక హోదాపై చర్చకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీఏసీ సమావేశంలో ఎప్పుడు చర్చ చేపట్టాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకొందామని  రాజ్యసభ ఛైర్మెన్  వెంకయ్యనాయుడు ప్రకటించారు.  దీంతో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ అంగీకరించారు. 

పార్లమెంట్ ఉభయ సభల్లో అవిశ్వాసంపై  చర్చ జరిగే  అవకాశం ఉంది. అయితే అవిశ్వాసం ఉద్దేశ్యం కూడ కేంద్ర ప్రభుత్వ తీరును బట్టబయలు చేయడమే. ఈ అవిశ్వాస తీర్మాణం సందర్భంగా ఎన్డీఏలో ఉన్న కొన్ని పక్షాలు కూడ  అవిశ్వాసానికి అనుకూలంగా కలిసివచ్చే అవకాశాలు ఉంటాయని టీడీపీ సహా ఇతర పార్టీలు భావిస్తున్నాయి. 

అవిశ్వాసానికి సహకరించాలని  కూడ  టీడీపీ సహా విపక్షాలు ఎన్డీఏలో ఉంటూ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. బీజేపీ తీరుపై ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన  గుర్రుగా ఉంది.  శివసేన లాంటి పార్టీల మద్దతును  కూడగట్టేందుకు టీడీపీ నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది సభ్యులున్నారు. అయితే మోడీ సర్కార్ గట్టెక్కాలంటే  272 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏకు  314 మంది ఎంపీల బలం ఉంది. యూపీఏకు 66 సభ్యులు మాత్రమే ఉన్నారు.అయితే  ఎన్డీఏలో అసంతృప్తిగా ఉన్న పార్టీలను తమ వైపుకు తిప్పుకొంటే  విపక్షాల బలం పెరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే  ఈ విషయంలో విపక్షాలు ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇదిలా ఉంటే నియమనిబంధనల ప్రకారంగా  అవిశ్వాసం తీర్మాణానికి సంబంధించి 10 రోజుల్లోపుగా  ఏ రోజున అవిశ్వాసంపై చర్చను చేపట్టనున్నారో స్పీకర్ ప్రకటించాలి. ఎంత సేపు ఈ అంశంపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకొన్నారో కూడ ప్రకటించాల్సి ఉంటుంది.

అవిశ్వాసంపై  చర్చ సందర్భంగా  కేంద్రం తీరును  ఎండగట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇతర పక్షాలు కూడ ఈ విషయమై కేంద్రం తీరుపై విమర్శలు సంధించేందుకు సిద్దంగా ఉన్నాయి. నాలుగేళ్ల ముందు ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేస్తామని తిరుపతితో పాటు ఏపీలో  చేసిన ప్రచారాన్ని టీడీపీ నేతలు ఉభయసభల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. మరో వైపు  బీజేపీ నేతలు కూడ ఏపీకి నాలుగేళ్లలో ఏ మేరకు నిధులు ఇచ్చామనే విషయాన్ని కూడ ప్రస్తావించనున్నారు.

ఇదిలా ఉంటే  అవిశ్వాసంపై చర్చ ముగింపు సందర్భంగా డివిజన్‌ కోరుతారా.... వాయిస్ ఓట్ తో ముగిస్తారా అనేది కూడ ప్రధానమైంది. అయితే   ఈ అవిశ్వాసంతో కేంద్రానికి వచ్చే పెద్ద ముప్పు లేదు.అయితే  త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా  బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఉండేందుకు బీజేపీయేతర పార్టీలు  చేసిన ప్రయత్నాలు ఆ రాష్ట్రంలో ఫలించాయి. ఈ సమయంలో  బీజేపీయేతర పార్టీలు కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా  ఏకమయ్యారు.  ఈ అవిశ్వాసం మరోసారి బీజేపీయేతర పక్షాలను మరోసారి ఏకం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఏపీలో మొత్తం 25 మంది ఎంపీలు ఉన్నారు. అయితే టీడీపీకి లోక్‌సభలో 16 మంది ఎంపీలున్నారు. వైసీపీ నుండి మరో నలుగురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించారు.  దీంతో  వీరు సాంకేతికంగా లోక్‌సభలో వైసీపీ సభ్యులుగా కొనసాగిస్తున్నారు.  మరోవైపు ఐదుగురు వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం తమ  రాజీనామాలను ఆమోదింపజేసుకొన్నారు. రాజ్యసభలో  వైసీపీకి ఇద్దరు సభ్యులున్నారు.

 అయితే  అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి పెద్దగా ఢోకా ఉండదు. కానీ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే అవకాశం మాత్రం విపక్షాలకు దక్కుతోంది.

అయితే  అవిశ్వాసం వీగిపోతుందని తెలిస్తే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే  ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి ఇచ్చిన హమీల విషయమై కేంద్రం తీరును ఎండగట్టేందుకు  టీడీపీ అవిశ్వాసం అంశాన్ని ఎంచుకొంది.  కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడ బీజేపీ తీరును ఎండగట్టాలని భావిస్తున్నాయి.  అయితే  ప్రభుత్వానికి పెద్దగా ముప్పు మాత్రం లేదు. అయితే బీజేపీలో కూడ  శతృఘ్నసిన్హా లాంటి ఎంపీలు బీజేపీ తీరుపై గుర్రుగా ఉన్నారు. అవిశ్వాసం సందర్భంగా  బీజేపీ అసంతృప్త ఎంపీలను  విపక్షాలు  తమ వైపుకు తిప్పుకొనే  అవకాశాలు కూడ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే  విపక్షాలు చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

మరో వైపు అవిశ్వాసం సందర్భంగా విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం చెప్పేందుకు బీజేపీ కూడ  సిద్దమైంది. ఏపీకి ఏ మేరకు సహాయం చేశామో అంకెలతో సహ వివరించనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.  ఇతర రాష్ట్రాల నుండి విపక్షాలు చేసే విమర్శలకు కూడ సమాధానాలు చెప్పేందుకు  ఆ పార్టీ నేతలు సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే అవిశ్వాసంపై చర్చ జరిగే సమయంలో వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో లేకపోవడం గమనార్హం.

 

 

 

click me!