మోదీని మళ్ళీ ప్రధానిని చేద్దాం... అదే మాకు పెద్ద గిప్ట్ : అతిథులను కోరిన వధూవరులు

By Arun Kumar PFirst Published Apr 28, 2024, 11:16 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానాన్ని చాటుకుంది ఓ యువ జంట. తమ పెళ్లి ఆహ్వాన పత్రిక ద్వా రా అతిథులను ప్రధానికి ఓటేయాలని కోరిన యువజంట చిక్కుల్లో పడ్డారు. 

బెంగళూరు : ఓవైపు లోక్ సభ ఎన్నికల హడావిడి... మరోవైపు పెళ్లిళ్ల సందడి నెలకొంది. అయితే ఈ రెండింటిని మిక్స్ చేస్తూ సరికొత్త ప్రయత్నం చేసిందో యువ జంట. తమ పెళ్లి కార్డును కేవలం అతిథుల  ఆహ్వానానికే కాదు ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.ప్రధాని నరేంద్ర మోదీపై అభిమానంతో వివాహ ఆహ్వాన పత్రికను రాజకీయాల కోసం ఉపయోగించిన యువజంట చిక్కుల్లో పడింది. బిజెపి ప్రత్యర్థుల ఫిర్యాదుతో వధూవరులపై కేసు నమోదయ్యింది. 

వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ యువజంట వివాహం పదిరోజుల క్రితం జరిగింది. అయితే ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర  మోదీపై అభిమానాన్ని పెళ్లి జంట చాటుకున్నారు. వివాహ ఆహ్వాన పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలని ... అందుకోసం ప్రతిఒక్కరు బిజెపి ఓటు వేయాలని అతిథులను కోరారు.  ''మళ్లీ నరేంద్ర మోదీని ప్రధానిని చేద్దాం... అదే మీరు మాకిచ్చే పెద్ద గిప్ట్. దేశ భద్రత బాగుంటేనే మన భవిష్యత్ బాగుండేది'' అంటూ వివాహ ఆహ్వాన కార్డులో పేర్కొన్నారు.

అయితే ఓటర్లను ప్రభావితం చేసేలా వివాహ కార్డును రూపొందించి పంచడంతో వధూవరులు చిక్కుల్లో పడ్డారు. నరేంద్ర మోదీకి ఓటు వేయాలంటూ వివాహ పత్రికలో కోరడంపై బిజెపి ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇది ఎలక్షన్ కోడ్ ను ఉళ్లంఘించడమేనని ఆరోపిస్తూ ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసారు. దీంతో వధూవరులపై పోలీసులు కేసు నమోదు చేసారు.

ఇదిలావుంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోనూ  ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసింది.  నందికంటి నర్సిములు, నిర్మల దంపతుల ఒక్కగానొక్క కొడుకుకు ఇటీవలే పెళ్లి చేసారు.  అయితే ప్రధాని మోదీని ఎంతగానో అభిమానించే నర్సిములు తన కొడుకు పెళ్లి ఆహ్వాన పత్రికను సరికొత్తగా తయారు చేయించాడు. 'నరేంద్ర మోదీకి ఓటు వేయాలని... అదే మాకిచ్చే పెద్ద గిప్ట్'అంటూ అతిథులను కోరారు. 

click me!