రాత్రి 3 గంటలకు.. ఐరన్ రాడ్‌తో బెదిరించి 20ఏళ్ల యువతిపై అఘాయిత్యం.. 24ఏళ్ల యువకుడిపై రేప్ కేసు

By telugu teamFirst Published Sep 26, 2021, 12:43 PM IST
Highlights

రాత్రి 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో ఓ మహిళను ఐరన్ రాడ్‌తో బెదిరించి 24 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని చెంబూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ 20ఏళ్ల బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అరెస్టు చేసిన ఆ నిందితుడికి వివాహమైందని, భార్యతోనే కలిసి ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. లైంగికదాడి చేసినప్పుడు మద్యం మత్తులో ఉన్నట్టు పేర్కొన్నారు. 
 

ముంబయి: మహారాష్ట్రలోని చెంబూర్‌లో దారుణం జరిగింది. రాత్రి 3 గంటల ప్రాంతంలో 20ఏళ్ల యువతిపై అఘాయిత్యం జరిగింది. 24ఏళ్ల యువకుడు రాత్రి ఆమెను అటకాయించి రాడ్‌తో బెదిరించాడు. మరో గల్లీలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి పాల్పల్డాడు.

ఆ యువతి శుక్రవారం రాత్రి ఓ ఫ్రెండ్‌తో కలిసి మెరైన్ డ్రైవ్‌కు వెళ్లింది. అనంతరం రాత్రి 3 గంటల ప్రాంతంలో ఆమె తన ఫ్రెండ్‌తో పాటుగా తన నివాసానికి వెనుదిరిగారు. అదే ఏరియాలో ఉంటున్న ధీరజ్ సింగ్ వారిని చూశాడు. వారు వస్తున్న దారికి అడ్డుగా నిలిచాడు. ఓ ఐరన్ రాడ్‌తో ఇద్దరినీ బెదిరించాడు. దీంతో ఆమె వెంటే ఉన్న మిత్రుడు పరారయ్యాడు. ఐరన్ రాడ్‌తో బెదిరిస్తూనే మరో గల్లీలోకి ఆమెను తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ధీరజ్ సింగ్ ఆమెను అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు.

బాధితురాలు చెంబూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ధీరజ్ సింగ్‌ను అరెస్టు చేశామని, ఆదివారం ఆయనను కోర్టులో హాజరుపరుస్తామని ఓ పోలీసు అధికారి వివరించారు.

ధీరజ్ సింగ్‌కు వివాహమైందని, ఆయన భార్యతో కలిసి ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. లైంగికదాడికి పాల్పడ్డప్పుడు ఆయన మద్యం మత్తులో ఉన్నట్టు వివరించారు. సింగ్‌పై ఇతర నేరాలేమైనా ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

click me!