శ్రావణమాసం... భారీగా పడిపోయిన పసిడి ధర

By ramya neerukondaFirst Published Aug 21, 2018, 12:02 PM IST
Highlights

కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది.

సాధారణంగా శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. బంగారం, వస్త్ర దుకణాలు కళకళలాడిపోయేవి. ఎందుకంటే.. ఈ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కాబట్టి బంగారం, కొత్త వస్త్రాలు కొనడానికి ప్రజలు ఆసక్తి చూపించేవారు. అయితే ఈ ఏడాది మాత్రం ఈ పరిస్థితి లేదని బంగారు ఆభరణాల తయారీదారులు వాపోతున్నారు. 

కొన్ని నెలలుగా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా.. ప్రస్తుతం అమ్మకాలు పుంజుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు పేర్కొంటున్నారు. రూపాయి విలువ పతనం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన విధంగా దేశంలో ధరలు తగ్గకపోయినా గడచిన ఆరు నెలల్లో విజయవాడలో పది గ్రాముల బంగారం ధర రూ.2,325 వరకు తగ్గింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నమోదైన రూ.32,825 గరిష్ట స్థాయి నుంచి బంగారం ధర ఆగస్టు 20 నాటికి రూ.30,500 తగ్గింది. ఇదే సమయంలో ఆభరణాల బంగారం ధర (22 క్యారెట్లు) రూ.29,250 నుంచి రూ.1,140 తగ్గి రూ.28,110 చేరుకుంది. అదే అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్‌ 11న 159 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ బంగారం ధర గత నాలుగు నెలల్లో పతనమవుతూ రూ.1,188 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

కొన్ని నెలలుగా ఇలా క్రమంగా బంగారం ధర తగ్గుతున్నా అమ్మకాలు పుంజుకోవడం లేదని  వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక తెలియజేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆభరణాల అమ్మకాలు దేశవ్యాప్తంగా 8 శాతం తగ్గినట్లు పేర్కొంది. 2016–17 ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 161 టన్నులుగా ఉన్న ఆభరణాల అమ్మకాలు.. ఈ ఏడాది ఇదే కాలానికి 148 టన్నులకు పడిపోయినట్లు నివేదిక తెలిపింది. 

అంతర్జాతీయంగా ఇంకా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండటం, అధిక పన్నులు, రూపాయి విలువ పతనంతో ఇక్కడి ధరలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో తగ్గిన రీతిలో తగ్గకపోవడంతో వినియోగదారులు కొనుగోళ్లు జరపడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

click me!