హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మకాలు పోలీసులకే సవాల్ విసురుతున్నాయి. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మలిచి అమ్మకాలు చేపట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్: చాక్లెట్ల ముసుగులో గంజాయి అమ్మకాలను చేపడుతున్న ఓ వ్యక్తిన పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బాలానగర్ లోని ఓ చిన్న పాన్ డబ్బాలో ప్రత్యేక పద్దతుల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ పాన్ షాప్ పై దాడిచేసిన పోలీసులకు అతడు గంజాయి విక్రయించే తీరును చూసిన ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
బాలానగర్ ప్రాంతంలో జయంత్ అనే వ్యక్తి పాన్ షాప్ నడిపేవాడు. అది బాగానే నడుస్తున్నా తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచన అతడికి కలిగింది. దీంతో ఈజీమనీ కోసం అడ్డదారులు తొక్కడం ప్రారంభించాడు. అతడు నిర్వహించే పాన్ షాప్ నే అడ్డాగా చేసుకుని కాలేజీ యువతకు గంజాయిని సరఫరా చేయడం ప్రారంభించాడు.
read more మేడ్చెల్ లో రెండేళ్ల బాలుడి మృతి: హైదరాబాదులో రెండేళ్ల బాలుడి మిరాకిల్ ఎస్కేప్
అయితే అందరు గంజాయి సప్లయర్ల మాదిరిగా పాకెట్లు రూపంలో కాకుండా కొత్త తరహాలో అమ్మేవాడు. గంజాయిని చాక్లెట్లుగా మలిచి ఎవరికీ అనుమానం రాకుండా కాలేజి యువతకు సప్లయ్ చేసేవాడు. అయితే ఈ వ్యవహారం గురించి కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో గుట్టు రట్టయ్యింది.
అతడి షాప్ లో అమ్మకంకోసం చాక్లెట్ల రూపంలో వుంచిన కిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై మాధకద్రవ్యాల సరఫరాకు సంబంధించిన కేసులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇతడికి గంజాయిని సరఫరా చేస్తున్న మరో వ్యక్తి పరారీలో వున్నట్లు పోలీసులు వెల్లడించారు.