
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ ను తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. అందుకే ఇది బరువు తగ్గడానికి సరైన ఆహారం అంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగున్న ఓట్ మీల్ ను నీళ్లు లేదా పాలతో వండుతారు. ఓట్ మీల్ లో డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల దీనిలో పోషక విలువలు పెరుగుతాయి. అంతేకాదు ఓట్ మీల్ లో పండ్లను కూడా వేసుకుని తినొచ్చు. అయితే భోజనానికి ముందు ఓట్ మీల్ వాటర్ ను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా?
ఓట్ మీల్ పోషక విలువలు: కేలరీలు 116, కార్బోహైడ్రేట్లు 20 గ్రా, కొవ్వు 2 గ్రా, ప్రోటీన్ 4 గ్రా,ఫైబర్ 3 గ్రా ఉంటాయి. ఓట్ మీల్ వాటర్ ను రోజూ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
ఓట్ మీల్ వాటర్ మన జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. నిజానికి ఎక్కువ పిండి పదార్థాలు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు చాలా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే తొందరగా ఆకలిగా అనిపిస్తుంది. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు మాత్రం మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తాయి. మలబద్ధకం సమస్యను తొలగించడానికి ఫైబర్ బాగా సహాయపడుతుంది. ఈ ఓట్ మీల్ వాటర్ మధుమేహం, గుండె సమస్యలు, క్యాన్సర్, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూడు కప్పుల ఓట్స్ లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే రోజులో ఏ సమయంలోనైనా ఓట్ మీల్ నీటిని తాగొచ్చు. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి
యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. ఈ ఫ్రీరాడికల్స్ ఎన్నో వ్యాధులకు దారితీస్తాయి. అయితే వీటిని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్లు బాగా సహాయపడతాయి. ఎన్నో రకాల కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయిత వోట్మీల్ నీటి నుంచి లభించే యాంటీఆక్సిడెంట్లను అవెంత్రామైడ్ అంటారు. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే ఈ నీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.
కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది
చెడు కొలెస్ట్రాల్ గుండె పోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అదే మంచి కొలెస్ట్రాల్ అయితే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఓట్ మీల్ నీటిలో ఉండే బీటా గ్లూకాన్ ఫైబర్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
కార్బోహైడ్రేట్స్ ను తీసుకున్న తర్వాత మీ శరీరంలోని క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలవుతుంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. అయితే పిండి పదార్థాలను ఫైబర్ తో తీసుకున్నప్పుడు అంటే ఓట్మీల్ నీటిని బీటా గ్లూకాన్ గా తీసుకుంటారు. ఇవి శరీరంలోని పిండి పదార్థాలను నెమ్మదిగా గ్రహిస్తాయి. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిని క్రమంగా పెంచుతుంది.