
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలుల వేగం బాగా పుంజుకుంటోంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఈ వాతావరణ మార్పుల పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వర్షాలు వుంటాయని తెలిపింది. ఆదివారంతో పాటు రాబోయే వారంలో ఏపీ, తెలంగాణలలో వెదర్ ఎలా వుంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం, అల్పపీడన పరిస్థితులు ఉన్నప్పటికీ మన రాష్ట్రాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉండబోతోంది. ఈ అల్పపీడనం ఇవాళ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల వైపు తీరం దాటే అవకాశం ఉండటంతో, భయంకరమైన వర్షాలన్నీ అక్కడే కురుస్తాయి. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష ముప్పు లేదు. కానీ, దీని ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లో చల్లటి బలమైన గాలులు వీస్తాయి. అక్కడక్కడ వర్షాలే పడతాయి. కాబట్టి సండే ప్రయాణాలు చేసేవారికి, టూరిస్ట్ ప్లేసులను విజిట్ చేసేవారికి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
రుతుపవనాల కాలం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి ప్రధాన కారణం 'ఎల్నినో' బలం పెరగడమే. దీనివల్ల నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్రంగా బలహీనపడ్డాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 16 నుంచి 21 వరకు కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాం, తెలంగాణలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో భారీ వర్షాలు కురుసే అవకాశాలు కూడా లేకపోలేదు.
వివిధ శాటిలైట్ డేటాని గమనిస్తే, ఏపీ, తెలంగాణ ఆకాశంలో రోజంతా మేఘాలు పరుగులు తీస్తూ కనిపిస్తాయి.
తెలంగాణ వాతావరణం: ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మధ్య, దక్షిణ తెలంగాణ, హైదరాబాద్లలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. తేమ ఉత్తర తెలంగాణలో 75%, మిగతా భాగాల్లో 52% వరకు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల జల్లులు పడవచ్చు. మిగతా కోస్తాంధ్ర, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. తేమ ఉత్తరాంధ్రలో 64%, మిగతా ఏపీలో 41%గా నమోదుకానుంది. రెండు రాష్ట్రాల్లోనూ గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.
ఈ వాతావరణ పరిస్థితులు రైతన్నలకు కొంచెం ఆందోళన కలిగించే విషయమే. నైరుతి రుతుపవనాల వల్ల గాలులు వీస్తున్నప్పటికీ, ఆ గాలిలో తగినంత తేమ లేకపోవడం వల్ల వానలు పడటం లేదు. దానికి తోడు సాధారణం కంటే ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతున్నాయి. సముద్రాల్లో వేడి వాతావరణం పెరుగుతున్నా, మన ప్రాంతాలపై ప్రభావం చూపే బలమైన అల్పపీడనాలు ఏర్పడటం లేదు. వర్షాలు సరిగా పడకపోవడం వల్ల పంటలకు, మొక్కలకు నీటి ఎద్దడి రాకుండా కొద్దిగా ఎక్కువ నీరు అందించాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు పరిస్థితిని బట్టి తగిన ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం.
ఆసియా ఖండం వ్యాప్తంగా వాతావరణాన్ని పరిశీలిస్తే, పసిఫిక్ మహాసముద్రంలో తీవ్రంగా ఉన్న 'లాలా' తుపాను కొంత బలహీనపడింది. అయినప్పటికీ దాని సుడిగాలులు గంటకు 95 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాయి. అక్కడ మరో 5 అల్పపీడనాలు ఉన్నాయి. ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడుతుండటంతో అది అల్పపీడనంగా మారే అవకాశం లేకుండా పోయింది.
భూమధ్యరేఖ వద్ద మేఘాల సాంద్రత తగ్గడం, అంటార్కిటికా నుంచి చల్లని గాలులు వస్తున్నప్పటికీ గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల వర్షపాతం పడిపోయింది. సముద్రంలో ఏవైనా బలమైన తుపాన్లు లేదా భారీ అల్పపీడనాలు రూపుదిద్దుకుంటే తప్ప, ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల నుంచి అత్యంత భారీ వర్షాలను ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు.