Weather Report: బ‌య‌ట‌కు వ‌చ్చే ముందు జాగ్ర‌త్త‌.. ఈరోజు పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు

Published : Mar 31, 2026, 06:55 AM IST

Weather Report: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు (మంగ‌ళ‌వారం) వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉండగా, మరికొన్ని జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.  

PREV
15
ద్రోణి ప్రభావం.. ఏపీలో వర్షాలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ద్రోణి ప్రభావం కనిపిస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు చోటుచేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా జ‌ల్లులు పడే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

25
కొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు

వర్షాల అవకాశాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడి గాలులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది.

అదే విధంగా పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో కూడా వేడి గాలులు ప్రభావం చూపవచ్చు. విజయనగరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో సాధారణ వడగాల్పులు వీచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతాల ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

35
తెలంగాణలో అకాల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో సోమ‌వారం రాత్రి నుంచి అకాల వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వ‌ర్షం కురిసింది. అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, మెద‌క్‌ జిల్లాల్లో అర్థరాత్రి నుంచి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీచాయి. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

45
హైదరాబాద్ పరిసరాల్లో వాతావరణ మార్పు

ఉత్తర తెలంగాణలో కురుస్తున్న వర్షాల ప్రభావం హైదరాబాద్ వైపు కూడా కనిపిస్తోంది. నగరంలో మబ్బులు కమ్ముకోవడంతో పాటు ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో చినుకులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈదురుగాలులు, మెరుపులు ఉండే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

55
ఎండ తీవ్రత ఇంకా కొనసాగుతోంది

వర్షాల హెచ్చరికలు ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత మాత్రం తగ్గలేదు. ఇటీవల నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 42.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా యల్లనూరు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 40.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా గుల్లదుర్తి, మార్కాపురం ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జాగ్రత్తలు అవసరం

వాతావరణంలో ఈ విధమైన మార్పులు కనిపిస్తున్న నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా, అవసరమైతే ఇంట్లోనే ఉండడం మంచిదని అధికారులు తెలిపారు. అలాగే వడగాల్పులు ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా తాగడం, బయటకు వెళ్లేటప్పుడు తల కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories